Saturday, November 15, 2025
HomeTop StoriesAyodhya Ram Mandir : భవ్య రామ మందిరం సంపూర్ణం..నవంబర్ 25న ప్రధాని పర్యటన!

Ayodhya Ram Mandir : భవ్య రామ మందిరం సంపూర్ణం..నవంబర్ 25న ప్రధాని పర్యటన!

Ayodhya Ram Mandir final construction : శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కోట్లాది హిందువుల కల సాకారమైంది. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిపై నిర్మిస్తున్న భవ్య మందిర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ శుభవార్తను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ చారిత్రక ఘట్టానికి ముగింపు పలుకుతూ, నవంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ శిఖరంపై పతాకాన్ని ఎగురవేయనున్నారు. 

- Advertisement -

సర్వాంగ సుందరంగా ఆలయ నిర్మాణం : శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, భక్తుల దర్శనానికి సంబంధించిన అన్ని కీలక నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

ప్రధాన ఆలయం: గర్భగుడిలో కొలువైన శ్రీరామ లల్లా ప్రధాన ఆలయ నిర్మాణం సంపూర్ణమైంది. ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణంలో మరో ఆరు ఆలయాల నిర్మాణం పూర్తయింది. వీటిలో మహాదేవుడు, గణేశుడు, హనుమంతుడు, సూర్యదేవుడు, భగవతి మాత, అన్నపూర్ణ మాత ఆలయాలు ఉన్నాయి.

రుషి మండపాలు: ప్రాంగణంలో వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్య మహర్షుల మండపాలతో పాటు నిషాధరాజు, శబరి, దేవి అహల్య మండపాలను సైతం పూర్తి చేశారు.
ఆలయ శిఖరంపై కలశ స్థాపన, జటాయువు, ఉడత విగ్రహాల ప్రతిష్ఠాపన కూడా పూర్తయింది.
“శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తయింది. మొదటి అంతస్తులో రామ పరివార్ (సీతారామలక్ష్మణ సమేత హనుమంతుడు) ప్రతిష్ఠాపన కూడా జరిగింది. ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసే రోజే, రామ పరివార్‌కు హారతి కార్యక్రమం ఉంటుంది. ఈ మహోత్సవానికి 6,000 నుంచి 8,000 మంది అతిథుల జాబితాను సిద్ధం చేస్తున్నాం,” అని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి నృపేంద్ర మిశ్రా తెలిపారు.

మోదీ పర్యటన.. ధ్వజారోహణ మహోత్సవం : నవంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మించిన రామమందిర శిఖరంపై పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం, ఆలయ నిర్మాణం పూర్తయినట్లు భక్తులకు అధికారికంగా ప్రకటించడం లాంటిదని ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

కొనసాగుతున్న సుందరీకరణ పనులు : ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఎల్&టీ సంస్థ ఆధ్వర్యంలో రోడ్లు, స్టోన్ ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. అలాగే, జీఎంఆర్ సంస్థ ‘పంచవటి’ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో కూడిన ల్యాండ్‌స్కేపింగ్ పనులను చేపడుతోంది. ఈ పనులకు భక్తుల దర్శనంతో ప్రత్యక్ష సంబంధం లేదని ట్రస్ట్ స్పష్టం చేసింది. వీటితో పాటు 3.5 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు గోడ, ట్రస్ట్ కార్యాలయం, అతిథి గృహం, ఆడిటోరియం వంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

మారిన దర్శన వేళలు : భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో ఇటీవల కీలక మార్పులు చేశారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
మధ్యాహ్నం 12:30 నుంచి 1:00 గంటల వరకు రాజ్‌భోగ్ హారతి కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు దర్శనం ప్రారంభమై, రాత్రి 9:30 గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి 8:30 తర్వాత భక్తులను క్యూలైన్లలోకి అనుమతించరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad