Sunday, November 16, 2025
Homeనేషనల్Migrant Voters Return: వలస ఓటు.. ఎటువైపు చూపు? పొట్ట చేతబట్టుకెళ్లినోళ్ల తీర్పు ఎవరికో!

Migrant Voters Return: వలస ఓటు.. ఎటువైపు చూపు? పొట్ట చేతబట్టుకెళ్లినోళ్ల తీర్పు ఎవరికో!

Migrant voter impact : పొట్ట చేతబట్టుకుని పరాయి రాష్ట్రాలకు వెళ్లిన బిహారీ బిడ్డలు… ఇప్పుడు తమ తలరాతను మార్చే తీర్పు ఇచ్చేందుకు సొంత గూటికి పరుగులు తీస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేడు జరగనున్న నేపథ్యంలో, దిల్లీ, ముంబయి, గుజరాత్ వంటి నగరాల నుంచి వలస కూలీలు కిక్కిరిసిన రైళ్లలో స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీంతో, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఈ ‘వలస ఓటు’ ఎవరికి వరం కానుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

- Advertisement -

ఓటు కోసం.. ప్రత్యేక రైళ్లు : తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వలస కూలీలు చూపుతున్న ఉత్సాహంతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దిల్లీలోని ఆనంద్ విహార్, న్యూదిల్లీ వంటి ప్రధాన స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ సోమవారం ఒక్కరోజే 32 ప్రత్యేక రైళ్లను నడిపింది. రద్దీ దృష్ట్యా, దిల్లీలోని ప్రధాన స్టేషన్లలో నవంబర్ 11 వరకు ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలను నిలిపివేశారు.

మిశ్రమ స్పందన.. భిన్న స్వరాలు : స్వగ్రామాలకు చేరుకున్న వలస కూలీల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

“జైపుర్ నుంచి కిక్కిరిసిన రైల్లో వచ్చాను. పరిశ్రమలు లేకపోవడం, ఉపాధి లేకపోవడమే బిహార్‌లో ప్రధాన సమస్య. నెలకు రూ.15 వేల కోసం మేం వలస వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి.”
– రామ్ ప్రసాద్ పాసవాన్, వలస కూలీ

సెలవు దొరకకపోయినా లీవ్ పెట్టి ఓటేయడానికి వచ్చాను. నితీశ్ కుమార్ పాలన చాలా బాగుంది. ఆయనే మళ్లీ సీఎం కావాలి.”
– మహ్మద్ ఖుర్షీద్, వలస కూలీ

ఈ వ్యాఖ్యలు వలస ఓటర్లలో ఉన్న భిన్న దృక్పథాలకు అద్దం పడుతున్నాయి. కొందరు మార్పును కోరుకుంటుంటే, మరికొందరు ప్రస్తుత పాలనకే జై కొడుతున్నారు.

వలస ఓటు బ్యాంకుపై పార్టీల కన్ను : బిహార్ భవిష్యత్తును నిర్దేశించడంలో వలస ఓటర్ల పాత్ర అత్యంత కీలకం.
గణాంకాల ప్రాధాన్యం: 2024 బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం, రాష్ట్రం నుంచి సుమారు 3 కోట్ల మంది ఉపాధి కోసం వలస వెళ్లారు. వీరిలో దాదాపు 50 లక్షల మంది నమోదిత ఓటర్లు.
గత చరిత్ర: ఎన్నికల డేటా ప్రకారం, వలస ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నప్పుడు అది ఎన్డీఏకు లాభించింది.
పార్టీల వ్యూహాలు: ఈసారి వలస ఓటర్లను ఆకర్షించేందుకు ఇరు కూటములు తీవ్రంగా ప్రయత్నించాయి. రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని మహాగఠ్‌బంధన్ హామీ ఇస్తుండగా, పారిశ్రామికీకరణపై ఎన్డీఏ దృష్టి సారించింది.

బీజేపీ ప్రత్యేక వ్యూహం: బీజేపీ నాయకులు జులై నుంచే దిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలలోని వలస కూలీలతో సమావేశాలు, వీడియో కాల్స్ నిర్వహించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా దాదాపు 2 కోట్ల మందిని చేరువయ్యే ప్రయత్నం చేశారు. పండుగలకే సొంతూరికి వచ్చే వలస జీవులు, ఈసారి ఓటు కోసం ప్రత్యేకంగా తరలిరావడం ఎన్నికల ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. వారి కష్టం, వారి ఆకాంక్షలే రేపటి బిహార్ భవిష్యత్తుకు మార్గం వేయనున్నాయి.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad