Census Notification 2025: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జనగణనతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2027 మార్చి 1వ తేదీ నాటికి రెండు దశల్లో జన, కుల గణన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఈసారి ట్యాబుల ద్వారా డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు, కులగణన సేకరణ జరగనుంది.
అలాగే ప్రత్యేకంగా తయారుచేసిన ప్రభుత్వం పోర్టల్స్, యాప్లలో ప్రజలే సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించనుంది. ఇందుకోసం మొత్తం 34లక్షల మంది గణకులు, సూపర్ వైజర్లు, 1.34లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకోనుంది. సమాచారణ సేకరణ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపట్టనుంది.
కాగా దాదాపు 15 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన జరగనుండంటం గమనార్హం. చివరగా 2011లో జనాభా లెక్కలు వివరాలు సేకరించారు. ప్రజల ఆర్థిక, సామాజిక సమాచారం సేకరించడం, విశ్లేషించడానే జనగణన అంటారు. అంటే దేశంలో మొత్తం ఎంత మంది జనాభా ఉన్నారు. వారి ఆదాయం ఎలా ఉంది.? ఏం పని చేస్తున్నారు.? వయసు, లింగం, భాష, మతం, విద్య, నివాస ప్రాంతం, తలసరి ఆదాయం, ఆస్తుల వంటి వివరాలను సేకరిస్తారు. ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు రూపకల్పనతో పాటు సంక్షేమ పథకాలను అందిస్తారు.
ఇక దేశ చరిత్రలో తొలి సారిగా కులగణన నిర్వహిచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పటికే కులగణన చేపట్టడంతో కేంద్రం కూడా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా దేశంలో ఏయే కులాల వారు ఎంత మంది ఉన్నారు. వారికి ఎలాంటి ప్రయోజనాలు దక్కుతున్నాయనే వివరాలను సేకరిస్తారు. ఈ వివరాల ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించనున్నారు. దీంతో నిజమైన అర్హులకు లబ్ధి చేకూరనుంది.
