Indian Aviation Safety Standards: భారత విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారాయి. విమాన ప్రయాణికుల భద్రతకు సంబంధించి పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇటీవల నిర్వహించిన వార్షిక ఆడిట్లో దేశీయ విమానయాన సంస్థల్లో ఏకంగా 263 భద్రతాపరమైన లోపాలు వెలుగుచూడటం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దిగ్గజ సంస్థలైన ఎయిరిండియా, ఇండిగోలతో పాటు ఇతర సంస్థల్లోనూ ఈ లోపాలను గుర్తించడం గమనార్హం.
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిర్దేశించిన ప్రమాణాలు, ప్రపంచ అత్యుత్తమ పద్ధతులకు అనుగుణంగా డీజీసీఏ ఈ ఆడిట్లను చేపట్టింది. ఈ తనిఖీల సందర్భంగా విమానయాన సంస్థల కార్యకలాపాల్లోని వివిధ అంశాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే మొత్తం 263 లోపాలు బయటపడ్డాయి. వీటిలో 19 “లెవల్ 1” కేటగిరీకి చెందినవి కాగా, మిగిలిన 244 “లెవల్ 2” కేటగిరీకి చెందినవి. “లెవల్ 1” లోపాలు అత్యంత తీవ్రమైనవిగా పరిగణిస్తారు, వీటికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ఎయిరిండియా గ్రూప్: టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లలో కలిపి అత్యధికంగా లోపాలు నమోదయ్యాయి. ఒక్క ఎయిరిండియాలోనే 51 లోపాలు కనుగొనగా, వీటిలో 7 “లెవల్ 1” కేటగిరీకి చెందినవి. విస్తారాలో 17 (వీటిలో 10 లెవల్ 1), ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 25 (వీటిలో 2 లెవల్ 1) లోపాలను గుర్తించారు. మొత్తంగా ఎయిరిండియా గ్రూపులో 19 “లెవల్ 1” ఉల్లంఘనలు బయటపడటం గమనార్హం.
ఇండిగో: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోలో 23 లోపాలను కనుగొన్నారు.
స్పైస్జెట్: స్పైస్జెట్లో 14 లోపాలు ఉన్నట్లు డీజీసీఏ నివేదిక వెల్లడించింది.
ఇతర సంస్థలు: అలయన్స్ ఎయిర్లో అత్యధికంగా 57 లోపాలు, క్విక్ జెట్లో 35, ఘోడావత్ స్టార్లో 41 లోపాలు నమోదయ్యాయి.ఆకాసా ఎయిర్ను ఇంకా ఆడిట్ చేయాల్సి ఉంది.
బయటపడిన ప్రధాన లోపాలు: జూలైలో నిర్వహించిన ఆడిట్లో ఎయిరిండియాలో పైలట్లకు సరైన శిక్షణ కొరవడటం, అనుమతి లేని సిమ్యులేటర్ల వాడకం, సిబ్బంది రోస్టరింగ్ వ్యవస్థలో బలహీనతలు వంటి తీవ్రమైన అంశాలు వెలుగుచూశాయి. అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన బోయింగ్ 787 విమాన ప్రమాదానికి, ఈ ఆడిట్కు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ, ఈ తరహా లోపాలు భవిష్యత్తులో పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/amit-shah-pahalgam-attack-pok-reclaim/
ఇటీవల ప్రధాన విమానాశ్రయాల్లో జరిపిన తనిఖీల్లోనూ డీజీసీఏ పలు వైఫల్యాలను గుర్తించింది. విమానాల్లో తరచూ అవే లోపాలు పునరావృతం కావడం.ఒక విమానం టైర్లు అరిగిపోయిన స్థితిలో ఉండటం. సిమ్యులేటర్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడం.
రన్వేలపై మార్కింగులు చెరిగిపోవడం. కొన్ని విమానాల్లో లైఫ్ వెస్టులు సరిగ్గా అమర్చకపోవడం వంటివి ఈ తనిఖీల్లో బయటపడ్డాయి.
డీజీసీఏ స్పందన: అయితే, ఎక్కువ కార్యకలాపాలు, పెద్ద సంఖ్యలో విమానాలు కలిగిన సంస్థల్లో ఆడిట్ సమయంలో ఎక్కువ సంఖ్యలో లోపాలు కనుగొనడం సాధారణమేనని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది నియంత్రణ సంస్థ చురుకైన పర్యవేక్షణకు నిదర్శనమని పేర్కొంది. లోపాలు కనుగొన్న సంస్థలకు అధికారికంగా సమాచారం అందించి, నిర్దిష్ట గడువులోగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.


