Thursday, June 12, 2025
Homeనేషనల్Meghalaya Honeymoon Murder: మేఘాలయ హమీమూన్ మర్డర్ కేసులో అదిరిపోయే ట్విస్టులు

Meghalaya Honeymoon Murder: మేఘాలయ హమీమూన్ మర్డర్ కేసులో అదిరిపోయే ట్విస్టులు

Meghalaya Honeymoon Murder: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించిన పోలీసుల విచారణలో అదిరిపోయే ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. భర్త హత్యకు కర్త, కర్మ, క్రియ మొత్తం భార్య సోనమ్ రఘువంశీనే అని పోలీసులు తేల్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. మే 11న రాజా రఘువంశీ-సోనమ్ వివాహం జరిగింది. పెళ్లైన వెంటనే రాజా హత్యకు సోనమ్ స్కెచ్ గీసింది. అత్తగారింట్లో ఉన్న మూడు రోజులు ఉన్న ఆమె పలు కారణాలు చెప్పి భర్తకు దూరంగా ఉంది. ఆ సమయంలోనే ప్రియుడు రాజ్ కుష్వాహాకు సోనమ్ మెసేజ్ పెట్టింది. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటికి రాగానే ప్రియుడుతో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. ఇందుకు రూ.4 లక్షలకు కిరాయి హంతకులను పురమాయించింది.

అనంతరం మే 20న భర్త రాజాతో కలిసి సోనమ్ మేఘాలయకు వచ్చింది. ఈ జంటను హంతకులు ఫాలో అయ్యారు. ఎక్కడికెళ్లినా సోనమ్.. ప్రియుడికి లొకేషన్ పంపిస్తూ ఉండేది. అలా జంటను కిరాయి ముఠా వెంటాడుతూ ఉండేది. మే 21న గౌహతిలో జంటను వెంబడించారని.. జంట ఉన్న హోటల్‌లోనే బస చేశారని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మే 23న మేఘాలయలోని జలపాతాన్ని చూసేందుకు ట్రెక్కింగ్ చేశారు. నిందితులు కూడా వారిని అనుసరించింది. ఈ సమయంలో సోనమ్ అలసిపోయినట్లు నటించింది. దీంతో భర్త ముందుకు నడుచుకుంటూ వెళ్లాడు. భర్త నిర్జన ప్రదేశానికి వెళ్లగానే భర్తను చంపాలని నిందితులను సోనమ్ ప్రేరేపించింది.

కానీ అలసిపోయామని.. ఇప్పుడు సాధ్యం కాదని తెలిపారు. అయితే తక్షణమే తన భర్తను చంపితే రూ.20లక్షలు ఇస్తానని ఆఫర్ చేసింది. దీంతో నిందితులు రాజా రఘువంశీని కొట్టి చంపేశారు. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత నిందితులతో కలిసి మృతదేహాన్ని స్వయంగా లోయలోకి తోసేసింది. రాజా పోస్ట్ మార్టం రిపోర్టులో తల వెనుక, ముందు భాగంలో రెండుసార్లు దెబ్బలు తగిలినట్లుగా తేలింది. హత్య జరిగిన వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా ‘ఏడేడు జన్మల్లోనూ నువ్వే నా తోడుగా’ అని సోనమ్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంది.

మే 23న మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జూన్ 2న లోయలో రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక సోనమ్ ఆచూకీ కోసం గాలిస్తుండగా జూన్ 9న యూపీలోని ఘాజీపూర్‌లో లొంగిపోయింది. అనంతరం హత్యలో పాల్గొన్న సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే రాజా రఘువంశీతో పెళ్లి కుదిర్చిన సమయంలో సోనమ్ తల్లితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. రాజాను పెళ్లి చేసుకోనని.. రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. అందుకు తల్లి తీవ్ర అభ్యంతరం చెప్పడంతో రఘువంశీని పెళ్లి చేసుకుంటాను.. కానీ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని సోనమ్ బెదిరించింది. తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేశామని.. తన సోదరి కావాలనే ఇదంతా చేసిందని పోలీసుల వాంగ్మూలంలో ఆమె సోదరుడు విపిన్ తెలిపాడు.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News