RSS ban issue in Karnataka: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాలను నిషేధించాలంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖ కర్ణాటకలో సంచలనం రేపింది. ఈ లేఖకు సంబంధించి అంశం ఆదివారం వెలుగులోకి రావడంతో రాష్ట రాజకీయల్లో తీవ్ర దుమారం లేచింది. అసలేం జరిగిందంటే..?
ప్రభుత్వ మైదానాలు, ఉద్యానవనాలు, పాఠశాలల ఆవరణలు, క్రీడా మందిరాలు తదితరాల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ… ఈ నెల 4న సీఎం సిద్ధరామయ్యకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఒక లేఖ రాశారు. ఆరెస్సెస్ ప్రచారంలో భాగంగా భైఠక్, సాంఘిక్ పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతించకూడదని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆ లేఖను పరిశీలించాలని ఉన్నతాధికారులకు సిద్ధరామయ్య సూచించినట్లు తెలుస్తుంది.
మౌలిక స్వరూపానికే ముప్పు: ప్రజల ఆలోచనల్లో ఆరెస్సెస్ విషబీజాలను నాటే ప్రయత్నం చేస్తుందని లేఖలో మంత్రి ఆరోపించారు. ఆలాంటి శక్తులను నియంత్రించకపోతే లౌకికవాదంతో పాటు రాజ్యాంగ మౌలికస్వరూపానికే ముప్పు వాటిళ్లుతుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ప్రభుత్వ ఆర్థికసాయంతో నడిచే పాఠశాలలు, కళాశాలల మైదానాలు, ప్రభుత్వ స్థలాల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలకు అనుమతించడం చాలా ప్రమాదమని అన్నారు. పోలీసుల అనుమతి లేకుండా పెద్ద కర్రలు చేతబట్టి ప్రదర్శనలివ్వడం వంటి అంశాలు.. యువతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్ధరామయ్యకు రాసిన లేఖకు పలువురు రాష్ట్ర మంత్రులు సైతం మద్దతు పలికారు.
ఆరెస్సెస్ను కాంగ్రెస్ ఏం చేయలేదు: ఆర్ఎస్ఎస్పై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆరెస్సెస్ కార్యకలాపాలను నిషేధించే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ను నిషేధించడం ఇందిరాగాంధీ వల్లే కాలేదు.. మీ వల్ల ఏమవుతుందని రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర అన్నారు. ఆరెస్సెస్ కార్యకలాపాలను నిషేధించడం ఎవరితరం కాదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు.


