Saturday, November 15, 2025
HomeTop StoriesBihar Politics: కమలం మెడలో హారం.. లాలూపై పదునైన ప్రహారం! నితీశ్‌ చేష్టలపై తేజస్వీ చురక!

Bihar Politics: కమలం మెడలో హారం.. లాలూపై పదునైన ప్రహారం! నితీశ్‌ చేష్టలపై తేజస్వీ చురక!

Bihar political controversy : ఎన్నికల ప్రచార వేదికపై ఓ వింత దృశ్యం.. పక్కనున్న నేత వారిస్తున్నా ఆగకుండా బీజేపీ మహిళా అభ్యర్థి మెడలో పూలమాల వేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్! ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగానే, “ఆయన ఆరోగ్యం బాగుందా?” అంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎక్స్‌లో వేసిన చురక బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు ఈ అనూహ్య పరిణామం, మరోవైపు లాలూ కుటుంబ పాలనపై నితీశ్ చేసిన పదునైన విమర్శలు రాష్ట్రంలో ఎన్నికల వేడిని మరింత పెంచాయి. అసలు ఆ సభలో ఏం జరిగింది? ఈ ఘటన వెనుక ఉన్న రాజకీయ కోణాలేంటి?

- Advertisement -

ఆపినా ఆగకుండా : ముజఫర్‌పుర్ జిల్లా మీనాపుర్ నియోజకవర్గంలో మంగళవారం జరిగిన ఎన్నికల సభలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన ప్రసంగం ముగిసిన తర్వాత, వేదికపై ఉన్న బీజేపీ అభ్యర్థి రమా నిషాద్‌ను పిలిచిన నితీశ్ కుమార్, ఆమె మెడలో పూలమాల వేయబోయారు. పక్కనే ఉన్న జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, సీఎం చేయి పట్టుకుని ఆపే ప్రయత్నం చేసినా ఆయన ఆగలేదు. ఈ వీడియో బయటకు రావడంతో, నితీశ్ తీరుపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లాలూ పాలనపై మాటల తూటాలు : అంతకుముందు తన ప్రసంగంలో నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కుటుంబ పాలన: దాణా కుంభకోణంలో ఛార్జ్‌షీట్ దాఖలు కాగానే లాలూ తన పదవికి రాజీనామా చేసి, రాజకీయ అనుభవం లేని తన భార్య రబ్రీ దేవికి సీఎం పదవి కట్టబెట్టారని ధ్వజమెత్తారు.

మహిళల నిర్లక్ష్యం: లాలూ హయాంలో మహిళలకు చేసిందేమీ లేదని, వారు తీవ్ర వివక్షకు గురయ్యారని ఆరోపించారు.

శాంతిభద్రతలు: తాము అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని, హిందూ-ముస్లింల మధ్య వివాదాలు ఉండేవని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు.

ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం నా తప్పే. అది గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇప్పుడు మిత్రపక్షం ఎన్డీఏతోనే శాశ్వతంగా కలిసి పనిచేస్తాను.”
– నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి

తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందని, ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద కోటి మంది మహిళల ఖాతాల్లో రూ.10,000 చొప్పున జమ చేశామని నితీశ్ గుర్తుచేశారు.

మా అభ్యర్థులను బీజేపీ బెదిరిస్తోంది: ప్రశాంత్ కిషోర్ : మరోవైపు, అధికార ఎన్డీఏ తమ అభ్యర్థులను బెదిరిస్తోందని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఒత్తిడి కారణంగానే తమ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఓటమి భయంతోనే ఎన్డీఏ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, అభ్యర్థులకు ఎన్నికల సంఘం భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని గొప్పలు చెప్పుకున్న బీజేపీ 240 సీట్లకే పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad