Sunday, November 16, 2025
Homeనేషనల్Operation Sindoor: పాకిస్థాన్‌కు గుండెకోత - 100 మంది సైనికులు హతం, 12 యుద్ధ విమానాలు...

Operation Sindoor: పాకిస్థాన్‌కు గుండెకోత – 100 మంది సైనికులు హతం, 12 యుద్ధ విమానాలు ధ్వంసం!

Indian Army military operations : భారత సైన్యం పంజా విసిరితే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు మరోసారి రుచి చూపించింది. నియంత్రణ రేఖ వెంబడి రహస్యంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’​లో దాయాది దేశం ఊహించని రీతిలో దెబ్బతింది. ఈ ఒక్క ఆపరేషన్‌లోనే వంద మందికి పైగా పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత సైన్యం ప్రకటించింది. అసలు భారత సైన్యం ఈ ఆపరేషన్‌ను ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? పాకిస్థాన్‌కు ఇంతటి భారీ నష్టం ఎలా వాటిల్లింది..? ఈ సైనిక చర్యలో ఏం జరిగింది?

- Advertisement -

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్‌కు తీరని నష్టాన్ని మిగిల్చిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో నియంత్రణ రేఖ (LoC) వెంబడి జరిగిన ఘర్షణల్లో 100 మందికి పైగా పాకిస్థాన్ సైనికులు హతమయ్యారని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. ఆగస్టు 14న పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించిన వీరమరణ సైనికుల జాబితా ఆధారంగా ఈ నష్టాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, పాక్ వాయుసేనకు చెందిన 12 యుద్ధ విమానాలు కూడా ఈ ఘర్షణల్లో నేలమట్టమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

పహల్గామ్‌ దాడికి ప్రతీకారం: మే 7న అమాయక పర్యాటకులపై జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఈ సైనిక చర్యను ప్రారంభించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం (IAF) తొమ్మిది ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు జరిపింది. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్ వెంటనే సరిహద్దుల్లో కాల్పులకు తెగబడటంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

నాలుగు రోజుల భీకర పోరు: మే 7 నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఇరు సైన్యాల మధ్య భీకర పోరు సాగింది. చివరికి మే 10న కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఆ సమయంలో పాకిస్థాన్ తమ నావికా, వాయుసేనలను పూర్తి సన్నద్ధతతో మోహరించినప్పటికీ, భారత సైన్యం ధీటైన ప్రతిఘటన ముందు అవి నిలవలేకపోయాయని జనరల్ ఘాయ్ తెలిపారు.

విఫలమైన పాక్ డ్రోన్ దాడులు – భారత్ తిరుగుదాడి: ఈ ఘర్షణల సమయంలో పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగించి భారత సరిహద్దు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు విఫలయత్నం చేసిందని జనరల్ ఘాయ్ తెలిపారు. “వారు పంపిన వివిధ రకాల డ్రోన్లలో ఒక్కటి కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు, అన్నీ నిర్వీర్యమయ్యాయి,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా, మే 9-10 రాత్రి భారత వైమానిక దళం పాక్ సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. “మేము వారి 11 ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నాం. ఈ దాడుల్లో ఎనిమిది ఎయిర్‌బేస్‌లు, మూడు హ్యాంగర్లు, నాలుగు రాడార్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి,” అని ఘాయ్ వివరించారు.

ఈ దాడుల్లో పాకిస్థాన్ ఒక C-130 రవాణా విమానం, ఒక AEW&C (గగనతల ముందస్తు హెచ్చరిక, నియంత్రణ) విమానం, ఐదు యుద్ధ విమానాలను కోల్పోయిందని తెలిపారు. ముఖ్యంగా, 300 కిలోమీటర్ల దూరం నుంచి భూస్థాయి క్షిపణులతో ఐదు ఫైటర్ జెట్లను కూల్చివేయడం ప్రపంచ సైనిక చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ‘ఎయిర్ కిల్’గా రికార్డు సృష్టించిందని ఆయన పేర్కొన్నారు.

ఉగ్రవాదులను నరకం వరకు వెంబడించాం: పహల్గామ్‌ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను 96 రోజుల పాటు వేటాడి, జూన్‌లో మట్టుబెట్టామని జనరల్ ఘాయ్ స్పష్టం చేశారు. “వారిని నరకం వరకు వెంబడించి అంతం చేశాం,” అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని, ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. అణు బెదిరింపులకు తలొగ్గేది లేదని, ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహించే వారిని ఒకే గాటన కట్టి చూస్తామని ఘాయ్ తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad