పాకిస్తాన్ దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్మూ, శ్రీనగర్, జైసల్మేర్, పఠాన్కోట్ వంటి కీలక ప్రాంతాలపై పాక్ క్షిపణి, డ్రోన్ దాడులకు భారత్ దిమ్మ తిరిగేలా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో సియాల్కోట్ బజ్వత్ సెక్టార్పై భారత సైన్యం బలమైన ఫిరంగి దాడులు ప్రారంభించగా, పాకిస్థాన్ ఆర్మీ అప్రమత్తమై ప్రతిస్పందించాల్సి వచ్చింది. ఈ ప్రాంతం పాక్ వైమానిక దళానికి కీలక బేస్లలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇక్కడే పాక్ అత్యంత శక్తివంతమైన వైమానిక స్థావరం ఉంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు భారత్ వ్యూహాత్మక చర్యలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాంటి సమయంలో సియాల్కోట్పై దాడి పాక్ను మరింత ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది.
భారత సైన్యం లాహోర్ నుండి సియాల్కోట్ వైపు భారీ బాంబుల దాడులు జరుపుతున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. దీంతో రెండు నగరాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీస్తుండగా, కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇంతకుముందు పాక్ సైన్యం జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ వంటి సరిహద్దు సమీప సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. కానీ భారత అత్యాధునిక S-400 మరియు ఇతర యాంటీ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ సమర్థవంతంగా స్పందించింది. అందులో భాగంగా పాక్ క్షిపణులను గాల్లోనే విజయవంతంగా బుగ్గి చేశాయి.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే యూరోపియన్ యూనియన్ విదేశాంగ ప్రతినిధి కాజా కల్లాస్తో మాట్లాడి, భారత్ పరిస్థితిని వివరించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో కూడా చర్చలు జరిపారు. “తమపై ఎలాంటి దాడి జరిగినా, అది తగిన ప్రతికారం పొందుతుంది” అనే హెచ్చరికను ఆయా దేశాలకు భారత్ స్పష్టంగా తెలిపింది. అంతేకాదు, ఈ విషయమై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రస్తుత పరిస్థితిపై వివరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రధాని మోదీతో సమీక్ష జరిపారు. దేశ భద్రతకు సంబంధించిన అన్ని శాఖలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి.