PM Modi’s visit to flood-affected Himachal Pradesh and Punjab : ప్రకృతి ప్రకోపానికి కకావికలమైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని వరద బాధితులకు భరోసానిచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నారు. ఇటీవలి కుండపోత వర్షాలు, వరదలతో అపార నష్టాన్ని చవిచూసిన ఈ రెండు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని ఆయన స్వయంగా అంచనా వేయనున్నారు. గగనతలం నుంచి వరద బీభత్సాన్ని పరిశీలించి, అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సహాయక చర్యలు, కేంద్రం నుంచి అందే సాయంపై ఆశలు చిగురిస్తున్నాయి. అసలు ప్రధాని పర్యటన ఎలా సాగనుంది..? ఏయే ప్రాంతాలను పరిశీలించనున్నారు..?
వరద గుండెపై ప్రధాని.. హిమాచల్లో తొలి అడుగు : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ మొదట పర్యటించనున్నారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు: ప్రధాని హిమాచల్ ప్రదేశ్కు చేరుకుని, ప్రత్యేక హెలికాప్టర్లో వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. నదుల ఉధృతి, కొండచరియలు విరిగిపడటం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను గగనతలం నుంచి పరిశీలిస్తారు.
ధర్మశాలలో ఉన్నతస్థాయి సమీక్ష: ఏరియల్ సర్వే అనంతరం, ప్రధాని ధర్మశాలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. వరద నష్టం, కొనసాగుతున్న సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని, అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు.
పంజాబ్లోనూ పర్యటన : హిమాచల్ పర్యటన ముగిసిన వెంటనే, ప్రధాని మోదీ వరదలతో అతలాకుతలమైన పంజాబ్కు పయనమవుతారు.
సాయంత్రం 4:15 గంటలకు: ప్రధాని పంజాబ్లోని గుర్దాస్పూర్కు చేరుకుంటారు.
పంజాబ్లో ఏరియల్ సర్వే: అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, పంజాబ్లోని వరద ముంపుకు గురైన ప్రాంతాలను కూడా ఏరియల్ సర్వే ద్వారా సమీక్షిస్తారు. పంట నష్టం, గ్రామాల ముంపు పరిస్థితిని అంచనా వేస్తారు.
పర్యటన ప్రాముఖ్యత : జాతీయ విపత్తుగా పరిగణించాల్సినంత నష్టం వాటిల్లిన ఈ తరుణంలో, ప్రధాని పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా అంచనా వేయడం ద్వారా, బాధితులకు అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించడానికి, పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులను విడుదల చేయడానికి ఈ పర్యటన దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధాని పర్యటనతో తమ కష్టాలు గట్టెక్కుతాయని, కేంద్రం నుంచి తక్షణ సాయం అందుతుందని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.


