హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి(Kacha Gachibowli) భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme court)లో విచారణ ముగిసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం చెట్ల నరికివేతపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా? లేదా? చెప్పాలని ప్రశ్నించారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
అయితే అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని.. దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ చెప్పారు. రూ.10వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ భూములను మార్టిగేజ్ చేశారా.. అమ్ముకున్నారా? అనేది తమకు అనవసరమని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా? లేదా? అనేది మాత్రమే ముఖ్యమని చెప్పారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
ఏఐతో రూపొందించిన ఫేక్ వీడియోలతో విపక్షాలు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేశాయని ధర్మాసనానికి విన్నివించారు. మినహాయింపునకు లోబడే చెట్లను తొలగించామని పేర్కొన్నారు. ఆ భూముల్లో ప్రస్తుతం అన్ని పనులను ఎక్కడికక్కడే నిలిపివేశామని పేర్కొన్నారు. 2004 నుంచి ఈ భూముల వ్యవహారం, కోర్టుల్లో ఉన్న పరిస్థితి, అభివృద్ధి తదితర వివరాలను సింఘ్వీ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.