Sunday, November 16, 2025
Homeనేషనల్Agaram Foundation : అక్షర దీపం సూర్య... 'అగరం'తో వేలమందికి వెలుగు!

Agaram Foundation : అక్షర దీపం సూర్య… ‘అగరం’తో వేలమందికి వెలుగు!

Suriya’s Agaram Foundation transforms lives : తెరపై కనిపించే హీరోలు వేరు, నిజ జీవితంలో హీరో అనిపించుకునే వారు వేరు. నటుడిగా విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా కొందరి కీర్తి ప్రతిష్టలు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఆ కోవకే చెందుతారు తమిళ స్టార్ హీరో సూర్య. కేవలం సినిమాలతోనే కాదు, తన గొప్ప మనసుతో, నిస్వార్థ సేవతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన స్థాపించిన ‘అగరం ఫౌండేషన్’ నేడు వేలాది మంది జీవితాల్లో అక్షర కాంతులు నింపుతోంది. అసలు ఈ ‘అగరం’ ప్రస్థానం ఎలా మొదలైంది? ఈ 15 ఏళ్లలో సూర్య సాధించిన ఘనత ఏంటి…? ఆ వేదికపై ఆయన కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమైన ఆ విజయగాథలేంటి…?

‘అగరం’ ఆవిర్భావం – మహోన్నత లక్ష్యం: నటన ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు, సంపాదన సమాజానికి తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో సూర్య 2006లో ‘అగరం ఫౌండేషన్’కు శ్రీకారం చుట్టారు. పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు అండగా నిలవడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. కేవలం ఆర్థిక సహాయం అందించి చేతులు దులుపుకోకుండా, పేదలు, అనాథ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు అయ్యే పూర్తి ఖర్చులను సూర్య భరిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అగరం ఫౌండేషన్ పాఠశాల కోసం తన సొంత ఇంటినే కేటాయించి సూర్య తన ఉదారతను చాటుకున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఆయన ముందుండి బాధితులకు అండగా నిలుస్తారు.

15 ఏళ్ల ప్రస్థానం – ఘనమైన వేడుక: ఈ అక్షర యజ్ఞం ప్రారంభమై 15 వసంతాలు పూర్తయిన సందర్భంగా, చెన్నైలో ఆదివారం సాయంత్రం ఒక भव्यమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సూర్యతో పాటు ఆయన సతీమణి జ్యోతిక, సోదరుడు కార్తీ, లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ వంటి ప్రముఖులు హాజరై సూర్య చేస్తున్న సేవను కొనియాడారు.

కళ్లముందు ఫలించిన కృషి – సూర్య భావోద్వేగం: ఈ 15 ఏళ్లలో ‘అగరం’ ఫౌండేషన్ ద్వారా ఏకంగా 8,000 మంది విద్యార్థులు తమ చదువును పూర్తిచేసి డిగ్రీ పట్టాలు అందుకున్నారు. వీరిలో 1800 మంది ఇంజనీర్లుగా, 51 మంది డాక్టర్లుగా స్థిరపడటం విశేషం. ఈ కార్యక్రమంలో భాగంగా, అగరం ఫౌండేషన్ అండతో ఉన్నత స్థాయికి చేరిన విద్యార్థులు వేదికపైకి వచ్చి, తమ జీవితాలను ఈ సంస్థ ఎలా మలుపు తిప్పిందో వివరిస్తూ తమ అనుభవాలను పంచుకున్నారు. ఒకప్పుడు పూట గడవడమే కష్టంగా ఉన్న తమ జీవితాల్లో అగరం ఫౌండేషన్ వెలుగులు నింపిందని, సూర్య తమకు దేవుడితో సమానమని వారు పేర్కొన్నారు.

- Advertisement -

తాను నాటిన అక్షర బీజాలు నేడు మహావృక్షాలై, వైద్యులుగా, ఇంజనీర్లుగా తన కళ్లముందు నిలబడటాన్ని చూసి సూర్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వారి మాటలు వింటూ వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సూర్య చేస్తున్న ఈ మహోన్నత సేవకు అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ, ‘చేతులెత్తి మొక్కాల్సిందే’ అంటూ కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad