Tamil Nadu Governor Pushups: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు.. సెలబ్రెటీల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీ సహా స్థానిక ఎమ్మెల్యేలందరూ యోగాసనాలు వేసి ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే తమిళనాడు గవర్నర్ రవీంద్ర నాయరణ్ రవి అలియాస్ ఆర్. రవి మధురైలోని వెలమ్మాల్ విద్యా సంస్థలో నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన ఫిట్నెస్ లెవల్స్ చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్న చిన్న యోగాసనాలు కాకుండా ఆయన చేసిన వ్యాయామం ఔరా అనిపించింది. గవర్నర్ హోదాలో రాష్ట్రానికి తొలి పౌరుడిగా ప్రజలకు ఫిట్నెస్ మెయింటెన్స్ చేయడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. 73 ఏళ్ల వయసు ఉన్న 25 ఏళ్ల కుర్రాడి లాగా ఆపకుండా 51 పుష్ అప్స్ తీసి షాక్ కు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గవర్నర్ ఫిట్నెస్ లెవల్స్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసు కేవలం నెబంర్ మాత్రమే అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ వయసులో అన్ని పుష్ అప్స్ ఎలా తీశారని.. మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండని ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.
కాగా మాజీ ఐపీఎస్ అయిన రవీంద్ర నారాయణ్ రవి ప్రతి యోగాసనం అలవోకగా చేసి చూపించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రవి.. 1976లో సివిల్స్ లో ఉత్తీర్ణులై కేరళ క్యాడర్ ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. ఫిజిక్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. 2021లో తమిళనాడు గవర్నర్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వంతో ఆయనకు సఖ్యత లేదు. ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా పెండింగ్ లో పెట్టడంతో వివాదం మొదలైంది.
గవర్నర్ బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్ సర్కార్ ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో బడ్జెట్ సందర్బంగా గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా కేవలం 5 నిమిషాల్లోనే తన ప్రసంగం ముగించారు. దీంతో ఈ వివాదం మరింత పెరిగింది. గవర్నర్ ప్రభుత్వ పాలనకు అడ్డంకిగా మారుతున్నారంటూ స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులు ఆమోదించకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది.