Saturday, November 15, 2025
Homeనేషనల్TRIBAL INNOVATION: కలుపు మొక్కతో కళారూపం.. గిరిజనుల చేతిలో 'లాంటానా' ఏనుగులకు అంతర్జాతీయ ఖ్యాతి!

TRIBAL INNOVATION: కలుపు మొక్కతో కళారూపం.. గిరిజనుల చేతిలో ‘లాంటానా’ ఏనుగులకు అంతర్జాతీయ ఖ్యాతి!

Tribal art from Lantana weed : అడవికి శాపంగా మారిన ఓ కలుపు మొక్క.. ఇప్పుడు గిరిజన మహిళల పాలిట వరంగా మారింది. వారి చేతిలో జీవం పోసుకుని, అద్భుతమైన కళారూపాలుగా రూపాంతరం చెంది, ఖండాలు దాటి కీర్తిని గడిస్తోంది. ప్రాణభయంతో అడవుల్లో కట్టెల కోసం తిరిగిన ఆ మహిళలు, నేడు ఇంట్లోనే కూర్చుని లక్షలు సంపాదిస్తున్నారు. ఇంతకీ ఏమిటా కలుపు మొక్క..? దానితో గిరిజనులు చేస్తున్న అద్భుతమేంటి? ఈ మార్పు వెనుక ఉన్న స్ఫూర్తిదాయక కథేంటి…?

- Advertisement -

ఏమిటీ ‘లాంటానా’? అడవికి ఎందుకంత చేటు : ‘లాంటానా’ అనేది ఓ రకమైన కలుపు మొక్క. ఇది అడవిలో విపరీతంగా పెరిగిపోయి, ఇతర మొక్కలు, గడ్డి జాతులు పెరగకుండా చేస్తుంది. దీనివల్ల ఏనుగులు, ఇతర శాకాహార జంతువులకు ఆహార కొరత ఏర్పడి, అవి జనావాసాలపై పడుతున్నాయి. నీలగిరి అడవుల్లో ఏనుగుల వలసలకు ఈ మొక్కే ప్రధాన కారణమని అటవీ శాఖ గుర్తించింది. ఈ హానికరమైన మొక్కను తొలగించే ప్రయత్నంలోనే, ఓ సరికొత్త ఉపాధి మార్గం పురుడు పోసుకుంది.

‘ది రియల్ ఎలిఫెంట్ కలెక్టివ్’ చొరవ : ఈ మార్పుకు నాంది పలికింది ‘ది రియల్ ఎలిఫెంట్ కలెక్టివ్’ అనే స్వచ్ఛంద సంస్థ. అడవిని నాశనం చేస్తున్న లాంటానా మొక్కలతోనే, గిరిజనులకు ఉపాధి కల్పించాలని ఈ సంస్థ సంకల్పించింది.

శిక్షణ: నీలగిరి జిల్లా, కోడముల గ్రామంలోని గిరిజన మహిళలకు లాంటానా కర్రలతో బొమ్మలు, ఫర్నీచర్ తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు.

ఏనుగు బొమ్మలకు గుర్తింపు: మొదట కుర్చీలు, టేబుళ్లు తయారు చేసినా, ఏనుగుల సమస్యను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో, 3డీ ఏనుగు బొమ్మలను తయారు చేయడం ప్రారంభించారు. వీటికి అంతర్జాతీయంగా అద్భుతమైన గుర్తింపు లభించింది.

“గతంలో తేయాకు తోటల్లో కూలీలుగా పనిచేసేవాళ్లం. అక్కడ జంతువుల దాడులతో ప్రాణభయం ఉండేది. ఇప్పుడు ఇంట్లోనే పిల్లలతో కలిసి పనిచేస్తున్నాం. సరిపడా ఆదాయం వస్తోంది. మా జీవితాలే మారిపోయాయి.”
– కోడముల గిరిజన మహిళ

లండన్ నుంచి అమెరికా వరకు : ఈ లాంటానా ఏనుగు బొమ్మలు ఇప్పుడు లండన్ ప్యాలెస్ నుంచి అమెరికా న్యూయార్క్ వరకు ప్రదర్శించబడుతున్నాయి.

లక్షల్లో ధర: ఒక అడుగు ఎత్తు ఉన్న శిల్పం ధర సుమారు రూ.1 లక్ష వరకు, పెద్ద శిల్పాల ధర రూ.10 లక్షల వరకు పలుకుతోంది.

3డీ టెక్నాలజీ: ఇప్పుడు కంప్యూటర్ 3డీ టెక్నాలజీ సాయంతో, 10.5 అడుగుల ఎత్తు వరకు నిజమైన ఏనుగుల పరిమాణంలో బొమ్మలను తయారు చేస్తున్నారు.

గిరిజనులకు ఏటా రూ.2.5 కోట్ల ఆదాయం : ఈ వినూత్న కార్యక్రమం ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏటా సుమారు 500 హెక్టార్ల అటవీ భూమి నుంచి హానికరమైన లాంటానా మొక్కలను తొలగిస్తున్నారు.

గిరిజన సాధికారత: పెట్టకురుంబ, బనియా, కట్టునాయక వంటి ఐదు గిరిజన తెగలకు చెందిన సుమారు 300 మంది మహిళలు ఈ పనిలో ఉపాధి పొందుతున్నారు. ఈ శిల్పాల విక్రయం ద్వారా, గిరిజనులకు ఏటా రూ.2.50 కోట్ల వరకు ఆదాయం లభిస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు థార్చ్ టెకేత్రా తెలిపారు. ఒక సమస్యనే, పరిష్కారంగా, ఉపాధి మార్గంగా మలచిన ఈ అద్భుత ప్రయోగం, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad