Saturday, November 15, 2025
Homeనేషనల్Jewelry restriction : నగలకు నయా రూల్.. మూడు దాటితే మూల్యం రూ.50,000!

Jewelry restriction : నగలకు నయా రూల్.. మూడు దాటితే మూల్యం రూ.50,000!

Social reform jewelry restriction : పసిడి అంటే భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు ప్రాణం. శుభకార్యాలు, పండుగల వేళ ఒంటినిండా బంగారు నగలు ధరించి మురిసిపోవడం మన సంప్రదాయంలో భాగం. అలాంటిది, పెళ్లిళ్లు, వేడుకల్లో మూడు నగలకు మించి ధరించవద్దని ఓ ఊరు శాసనం చేస్తే? అతిక్రమిస్తే ఏకంగా రూ.50,000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తే? ఉత్తరాఖండ్‌లోని రెండు గ్రామాలు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు వారు ఈ కఠిన నిబంధన ఎందుకు పెట్టారు? ఆర్థిక అసమానతలకు అడ్డుకట్ట వేసేందుకా? లేక ఆడంబరాలకు కళ్లెం వేసేందుకా? ఈ చారిత్రక తీర్మానం వెనుక ఉన్న అసలు కథేంటి?

- Advertisement -

సమానత్వపు స్వర్ణాభరణం : దేవభూమి ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్ జిల్లా, వికాస్‌నగర్-జాన్సార్ బవార్ గిరిజన ప్రాంతంలో ఉన్న కందద్, ఇంద్రోలి గ్రామాలు ఈ చారిత్రక నిర్ణయానికి వేదికయ్యాయి. అక్టోబర్ 16న సమావేశమైన ఈ గ్రామాల ప్రజలు, ఓ సామాజిక సంస్కరణకు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు.

తీర్మానం: ఇకపై గ్రామాల్లోని మహిళలు వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో మూడు బంగారు ఆభరణాలకు మించి ధరించకూడదు.
అనుమతించినవి: చెవిపోగులు, మంగళసూత్రం, ముక్కు పుడక. ఈ మూడింటికి మాత్రమే అనుమతి ఉంది.
జరిమానా: నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ.50,000 జరిమానా విధించాలని నిర్ణయించారు.

ఎందుకీ నిర్ణయం : ఈ కఠిన నిర్ణయం వెనుక ఓ బలమైన సామాజిక కారణం ఉంది.
“వేడుకల్లో కొందరు మహిళలు తాహతుకు మించి నగలు ధరిస్తుంటే, ఆర్థిక స్థోమత లేని మరికొందరు తక్కువ నగలతొ కనిపిస్తున్నారు. ఇది వారిలో తీవ్రమైన ఆత్మన్యూనతా భావాన్ని కలిగిస్తోంది. ఇతరులతో పోల్చుకుని, అప్పులు చేసి మరీ బంగారం కొనాల్సిన దుస్థితి ఏర్పడుతోంది,” అని కందద్ గ్రామానికి చెందిన అమృతా చౌహాన్ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలోని రైతుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, ఆడంబరాల ప్రదర్శన వల్ల పేద, ధనిక మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతోందని గ్రామస్థుడు బల్దేవ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక అసమానతలను రూపుమాపి, గ్రామంలోని మహిళలందరూ వేడుకల్లో సమానంగా కనిపించాలనే ఉన్నతమైన లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పంచాయతీ ప్రధాన్ అరవింద్ తెలిపారు.

మహిళల హర్షం.. యువత అభినందన : ఆశ్చర్యకరంగా, ఈ నిర్ణయాన్ని గ్రామాల్లోని మహిళలు మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఇది తమపై మోయలేని ఆర్థిక భారాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువతరం కూడా ఈ సంస్కరణను అభినందిస్తోందని, రాబోయే తరానికి ఇదొక మంచి పాఠం అవుతుందని గ్రామ పెద్దలు అంటున్నారు. కాలక్రమేణా మారుతున్న సంస్కృతిలో, ఆడంబరాల కన్నా ఆత్మీయతకే విలువనిచ్చే ఈ గ్రామాల నిర్ణయం, నేటి సమాజానికి ఓ సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad