Sunday, November 16, 2025
Homeనేషనల్Vijay Thalapathy: పరువు హత్యలపై 'దళపతి' పోరాటం.. సుప్రీంకోర్టుకెక్కిన విజయ్ పార్టీ!

Vijay Thalapathy: పరువు హత్యలపై ‘దళపతి’ పోరాటం.. సుప్రీంకోర్టుకెక్కిన విజయ్ పార్టీ!

Special law against honor killings in Tamil Nadu : సినిమాల్లో అన్యాయాన్ని ఎదిరించే కథానాయకుడు, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఓ సామాజిక రుగ్మతపై సమరశంఖం పూరించారు. తమిళనాట పెరిగిపోతున్న పరువు హత్యలనే అమానవీయ దురాచారంపై నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇటీవల ఓ దళిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన నేపథ్యంలో, ఈ హత్యలకు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని, నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టడం వెనుక ఉన్న బలమైన కారణాలేంటి..? ఈ న్యాయపోరాటం పరువు హత్యల దురాచారానికి అడ్డుకట్ట వేయగలదా.?

- Advertisement -

ఇంజినీర్ హత్యతో రగిలిన ఆగ్రహం:

జులై 27న తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగిన ఒక దారుణ ఘటన ఈ న్యాయపోరాటానికి తక్షణ కారణమైంది. ఐటీ ఉద్యోగి అయిన కవిన్ సెల్వగణేషన్ అనే దళిత యువకుడు, వేరొక సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇదే అతడి పాలిట శాపంగా మారింది. కులం పేరిట రగిలిపోయిన యువతి కుటుంబ సభ్యులు, కవిన్‌ను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ పరువు హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, యువతి సోదరుడు సుర్జిత్, తండ్రి శరవణన్‌ను అరెస్టు చేశారు.

రంగంలోకి టీవీకే.. సుప్రీంకోర్టులో పిటిషన్:

ఈ దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించిన విజయ్ టీవీకే పార్టీ, కేవలం నిందితులను శిక్షించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే, పరువు హత్యలను అరికట్టేందుకు, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ఒక పటిష్ఠమైన ప్రత్యేక చట్టాన్ని రూపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా:

నిజానికి, తమిళనాడులో పరువు హత్యలకు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అనేక రాజకీయ పక్షాలు, సామాజిక సంఘాలు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతోనే, తాము నేరుగా ప్రజల పక్షాన సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చిందని టీవీకే పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న తరుణంలో, కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం కాకుండా, ఇలాంటి కీలక సామాజిక అంశాన్ని టీవీకే పార్టీ చేతికి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పిటిషన్ కేవలం ఒక న్యాయపోరాటమే కాదు, విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఒక కీలకమైన ముందడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad