Thursday, September 19, 2024
HomeNews4th year: జగనన్న తోడు-చిరువ్యాపారుల ఉపాధికి ఊతం

4th year: జగనన్న తోడు-చిరువ్యాపారుల ఉపాధికి ఊతం

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేలు

వరుసగా నాలుగో ఏడాది.. మొదటి విడతగా జగనన్న తోడు – చిరువ్యాపారుల ఉపాధికి ఊతం. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేలు అంతకు పైగా.. 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలు. రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ.560.73 కోట్లను క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.

- Advertisement -

పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, సెర్ఫ్‌ సీఈఓఏ ఎండి ఇంతియాజ్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సెక్రటరీ బి మొహమ్మద్‌ దీవాన్ మైదీన్‌, గ్రామ వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌ జి లక్ష్మీషా, గ్రామవార్డు సచివాలయాల శాఖ అదనపు డైరెక్టర్‌ భావన, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్‌ఎల్‌బీసీ ఏపీ కన్వీనర్‌ నవనీత్‌ కుమార్, స్త్రీనిధి ఎండీ కె వి నాంచారయ్య, ఆప్కాబ్‌ ఎండీ ఆర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, పలు బ్యాంకుల ప్రతినిధులు హాజరు.

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:

దేశం మొత్తం కంటే ఎక్కువ లబ్ధిదారులు…
దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎక్కడా కూడా ఇన్ని లక్షల మంది చిరువ్యాపారులకు మంచి చేసే కార్యక్రమం జరగడం లేదు. లబ్ధిదారుల సంఖ్యలో దేశం మొత్తం ఒకవైపు ఉంటే, ఆంధ్రరాష్ట్రంలో దేశం మొత్తం కన్నా ఎక్కువ మంది కనిపించడం అరుదైన ఘటన.

పేదలకు మేలు జరిగే మహాయజ్ఞం.
ఇంత సత్ఫలితాలను ఇచ్చే విధంగా నడిపిస్తున్నందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ, వాలంటీర్‌ వ్యవస్ధ, సెర్ఫ్, మెప్మాతో పాటు ముఖ్యంగా తోడ్పాడును అందిస్తున్న బ్యాంకర్లు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
అందరం కలిసికట్టుగా ఒక్కటై తలోచేయి వేస్తేనే… పేదవాడికి మంచి జరిగే మహాయజ్ఞం సత్ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు అదే జరుగుతుంది.

రాష్ట్రంలో చిరువ్యాపారాలు చేసుకుంటున్న… 5,10,412 మంది అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మంచి చేస్తూ.. వారు చేస్తున్న చిరువ్యాపారాలకు ఈ రోజు నిజంగా గొప్ప తోడు ఈ పథకం ద్వారా వచ్చింది. ఈ రోజు లబ్ధి పొందుతున్న 5.10 లక్షల మందిని కలుపుకుంటే.. ఇంతవరకు 15,87,000 మంది చిరువ్యాపారులైన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మంచి జరిగింది. హస్త కళాకారులకూ ఈ పథకం ద్వారా మేలు జరిగింది.

రూ.10వేలు చొప్పున రూ.549 కోట్ల వడ్డీలేని రుణాలు
ఈ 5,10,412 మంది చిరువ్యాపారులు, చేతివృత్తుల వారిలో 4,54,267 మంది సకాలంలో రుణాలు చెల్లించి మరలా రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ రుణాలు పొందినవారు ఉన్నారు. సకాలంలో చెల్లించిన వారికి ఇచ్చే రుణాలను రూ.11వేల నుంచి రూ.13వేల వరకు పెంచారు. కొత్తగా మరో 56,000 మంది ఈపథకం ద్వారా రుణాలు పొందుతున్నారు. మొత్తంగా ఈ విడతలో 5.10 లక్షల మందికి ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున రూ.549 కోట్ల వడ్డీలేని రుణాలు వారి చేతిలో పెడుతున్నాం.
ఇది కాకుండా ఈ ఏడాది మే వరకు వారు వడ్డీ రూపంలో కట్టిన రూ.11.03 కోట్లును తిరిగి ఇవాళ వాళ్ల బ్యాంకు అకౌంట్లలో వెనక్కి ఇస్తున్నాం. దీంతో పాటు రూ.549.70 కోట్లు రుణంతో కలుపుకుని ఇస్తున్నాం.

15.87 లక్షల మందికి రూ.2995 కోట్ల రుణాలు.
ఇప్పటివరకు 15,87,492 మంది చిరు వ్యాపారులందరికీ వడ్డీ లేనిరుణం కింద రూ.2955 కోట్లు ఇవ్వగలిగాం. వీరిలో ఒక్కసారి బ్యాంకుల నుంచి రుణం తీసుకుని దాన్ని తిరిగి చెల్లించి మరలా రుణం తీసుకున్నవారు 13,29,011 మంది ఉన్నారు. వీరంతా సున్నావడ్డీ పొందుతున్నారు.
జగనన్న తోడు పథకం ద్వారా 15.31 లక్షల మంది చిరువ్యాపారులకు ఇంతవరకు సున్నావడ్డీ కింద రూ.74.69 కోట్లు చెల్లించి లబ్ధి చేకూర్చాం.

చిరు వ్యాపారులు- సమాజ సేవకులు.
ఈ చిరువ్యాపారుల అంతా తమకు తాము వ్యాపకం కల్పించుకోవడమే కాకుండా… సమాజసేవ కూడా చేస్తున్నారు. ఒకరి మీద ఆధారపడే పరిస్థితిలేకుండా వాళ్లంతట వాళ్లే బ్రతుకుతూ.. ఇంకా ఒకరికో, ఇద్దరికో ఉపాధి చూపిస్తూ చిరువ్యాపారం చేస్తున్నారు. అందుకనే చిరువ్యాపారాలు చేసేవాళ్లందరికి తోడుగా నిలబడాలన్న ఆలోచన హృదయపూర్వకంగా చేశాం.

పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడుబండ్ల మీద పండ్లు, కూరగాయలు, వస్తువులు, ఆహారపదార్ధాలు అమ్ముకునేవారు, రోడ్‌ పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహిస్తున్నవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, ఆటోలు, సైకిళ్లపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు చేనేత కార్మికులు, సాంప్రదాయ చేతివృత్తులకళాకారులు, ఇత్తడి పనిమీద బ్రతికేవారు, బొబ్బిలి వీణలు తయారు చేసేవాళ్లు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారీ, తోలుబొమ్మలు తయారు చేసేవాళ్లు, లేసు వర్కర్స్‌.. అందరికీ ఈ పథకం ఉపయోగపడుతుంది.

రూ.10వేలతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. వాళ్లకు ఇదొక రికరింగ్‌ అకౌంట్‌ కింద.. సకాలంలో డబ్బులు చెల్లించిన వెంటనే బ్యాంకులు మరలా వాళ్లకి రుణాలు మంజూరు చేసి తోడుగా నిలబడతాయి. ఈ క్రమంలో వాళ్లు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి వారి అకౌంట్లలోకి చెల్లిస్తుంది. ఇదొక గొప్ప కార్యక్రమం.

రూ.10 వేల నుంచి రూ.13వేల వరకూ..
రూ.10వేలతో మొదలయ్యే ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా కడుతూ.. వారిని మోటివేట్‌ చేసేందుకు రూ.1000 ఎక్కువగా రూ.11 వేలు ఇవ్వమని చెప్పాం. రెండో సంవత్సరం దాన్ని రూ.12వేలకు, ఆ తర్వాత రూ. 13వేలు వరకూ ఇస్తూ వారిని మోటివేట్‌ చేయాలని బ్యాంకులను కోరాం. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడ్డానికి ఈ డబ్బులు బాగా ఉపయోగపడతాయి.

నా పాదయాత్రలో కళ్లారా చూసి..
నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో స్వయంగా నా కళ్ళారా చూశాను. చాలాచోట్ల పుట్‌పాత్‌ వ్యాపారులను, బండ్లమీద టిఫిన్‌లు అమ్ముకుంటున్నవారితో కలిసి మాట్లాడాను. వ్యాపారం కోసం వాళ్లకు రూ.1000 ఆ రోజు పెట్టుబడుకై ప్రైవేటు వ్యాపారుల దగ్గర తీసుకుంటే రూ.100 కట్‌ చేసుకుంటే.. సాయంత్రానికి రూ.1000 వెనక్కివ్వాలని అడిగేవాళ్లు. అంత దారుణమైన పరిస్థితిలో ఉండేవారు. అలాంటి వారికి వ్యాపారం చేసుకోవడం కష్టం. డబ్బులు పుట్టవు, ఇచ్చేవాళ్లు ఉండరు కాబట్టి… వేరే గత్యంతరం లేక వడ్డీవ్యాపారుల మీదే బ్రతికాల్సిన పరిస్థితి. దీనివల్ల నెలకు రూ.10 వడ్డీ ఇవ్వాల్సిన పరిస్థితి. రూ.5, రూ.6 వడ్డీకి దొరికితే అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి.ఇదంతా నా కళ్లారా చూసి.. వాళ్ల పరిస్థితులను మార్చాలన్న ఆరాటం నుంచి ఈ జగనన్న తోడు అనే పథకం పుట్టింది.

జగనన్న తోడు- ఓ విప్లవం.
ఇందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే… జగనన్న తోడు పథకం ద్వారా లబ్ది పొందిన 15.80 లక్షల మందిలో 80 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇది నిజంగా ఒక విప్లవం. ఇందులో 80 శాతం మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉండటం అన్నది మరోక విప్లవం. ఇలా సామాజికంగా అట్టడుగున ఉన్నవారందరికీ ఇది ఉపయోగపడుతుంది. అక్కచెల్లెమ్మలందరికీ ఉపయోగపడే గొప్ప కార్యక్రమమిది.
ఈ కార్యక్రమం ద్వారా అంతా మంచి జరగాలని, అందరూ బాగుపడాలని మనసారా కోరుకుంటున్నారు. చిరువ్యాపారాలు చేసుకుంటున్నవారికి ఎవరికైనా ఈ పథకంలో పొరపాటున రాని పరిస్థితి ఉంటే.. వెంటనే సచివాలయం వ్యవస్ధను సంప్రదించండి. అక్కడ సిబ్బంది మీకు అందుబాటులో ఉండి, తోడుగా నిలుస్తారు. వాలంటీర్‌ని అడిగినా… దగ్గరుండి మీ ద్వారా దరఖాస్తు చేయించి, వెరిఫై చేసి మీకు పథకం అందేలా చేస్తారు. లేదా 1902 నెంబర్‌కు ఫోన్‌ చేసినా వాళ్లు కూడా మీకు ఈ పథకం అందించడానికి సహాయపడతారు.

ఈ ప్రభుత్వంలో అర్హత ఉన్నవారు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు… ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్న తపన, తాపత్రయ పడే ప్రభుత్వం మనది. ఈ పథకం ద్వారా మంచి జరిగినవారందరికీ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడి దయ వలన రావాలని కోరుకుంటున్నాను.

ప్రతి రెండు సచివాలయాలకు చెందిన సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ ఒక బ్యాంకుతో కనెక్ట్‌ చేసి, చేయి పట్టుకుని నడిపించే మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో రుణాలు ఇప్పించడంతో పాటు లబ్ధిదారులతో తిరిగి కట్టించేలా చేయడం కూడా అంతే ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమంగా చేపట్టాలి. బ్యాంకర్లకు నమ్మకం పెరిగే కొద్ది వీళ్ల సంఖ్య పెరుగుతుంది.
ఈ లబ్ధిదారుల సంఖ్య పెరగాలంటే… క్రమశిక్షణతో సకాలంలో రుణాలు తిరిగి చెల్లించాలి. దాన్ని ప్రోత్సహించేందుకే సున్నావడ్డీ కింద మనం ఆరునెలలకొకసారి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని కూడా కలెక్టర్లు… సచివాలయం ఓరియెంటేషన్‌లో జత చేయాలి అని సీఎం ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News