Road Accident at Reddypalli Cheruvu Katta: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . రాజంపేట నుంచి రైల్వేకోడూరుకు మామిడి కాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రాజంపేట నుంచి రైల్వేకోడూరుకు మామిడి కాయల లోడుతో వెళ్తున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై అదుపుతప్పి బోల్తా పడింది. స్పాట్ లో ఎనిమిది చనిపోయారు. ప్రమాద సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో చిక్కుకునన్న తొమ్మిది మందిని రక్షించి రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులంతా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వాసులగా పోలీసులు గుర్తించారు.
మంత్రి భరోసా
ఈ దుర్ఘటనపై మంత్రి జనార్ధన్ రెడ్డి స్పందించారు. జిల్లా ఉన్నతాధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాకుండా.. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారందరూ కూలీలు కావడం బాధాకరమని ఆయన అన్నారు.


