Ahmedabad flight crash : ఆకాశాన్ని చీకటి మేఘాలు కమ్మినట్లు…. రెక్కలు విప్పుకున్న పక్షిలా గగనతలంలో విహరించాల్సిన విమానం రెప్పపాటు కాలంలోనే కుప్పకూలి పోయింది. గగనసీమలో మృత్యువు క్షణాల్లో కరాళ నృత్యం చేసింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే లోపే అగ్నికీలలలో కాలి బూడిదై పోయారు. జీవంలేని నెత్తుటి తునకల మధ్య ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల ఆర్తనాదాలు ఆకాశపు అంచులని తాకాయి. ఆ కన్నీటి అలల కష్టాల చీకట్లో… నిస్సహాయతకు చేయూతగా టాటా గ్రూప్ ఓ ఆశా కిరణంగా ఆపద్భాందువై ముందుకు వచ్చింది. మీరు ఒంటరి కారు మేమున్నామంటూ భరోసా నిచ్చింది.
అహ్మదాబాద్లో జరిగిన దురదృష్టకర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు టాటా గ్రూప్ భారీ ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ విషయాన్ని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ వెల్లడించారు.
ప్రధాన అంశాలు:
రూ. 1 కోటి పరిహారం: ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం అందిస్తారు.
వైద్య ఖర్చులు భారం: గాయపడిన వారందరి వైద్య ఖర్చులను టాటా గ్రూప్ భరిస్తుంది, వారికి అవసరమైన అన్ని రకాల సంరక్షణ అందిస్తుంది.
బీజే మెడికల్ హాస్టల్ పునర్నిర్మాణం: విమానం కూలినప్పుడు దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పునర్నిర్మాణానికి కూడా టాటా గ్రూప్ సహాయం చేస్తుంది.
టేకాఫ్ అయిన వెంటనే…
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ముఖ్యంగా, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై విమానం కూలడంతో వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు.