Saturday, June 14, 2025
HomeNewsAhmedabad Plane Crash: ఒక్కడు మిగిలాడు

Ahmedabad Plane Crash: ఒక్కడు మిగిలాడు

Ahmedabad Plane Crash: వందలాది ప్రాణాలను బలిగొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. కళ్లముందే విగత జీవులుగా మారిన దైన్యం ప్రతి ఒక్కరిని ఆందోళనలో నెట్టేసింది. దాదాపుగా అందరూ మరణించారనుకుంటున్న వేళ, విమానం నుంచి మృత్యువును జయించి ఒకే ఒక్కరు తిరిగి వచ్చారు. ఆయనే బ్రిటన్ పౌరుడు రమేశ్ విశ్వకుమార్ – నిజమైన మృత్యుంజయుడు, అదృష్టానికి నిదర్శనంగా నిలిచారు. ఈ విషాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.

- Advertisement -


మృత్యువును జయించిన ఒకే ఒక్కడు :
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నివాస ప్రాంతంలో విమానం కూలడంతో భారీ ప్రాణనష్టం జరిగినట్లు అహ్మదాబాద్ పోలీస్ కమీషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపుగా అందరు ప్రాణాలు కోల్పోగా, బ్రిటన్ కి చెందిన రమేశ్ విశ్వకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. 11ఏ నంబర్ సీటులో కూర్చున్న ఆయన, విమానం కూలినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలతో నడుస్తూ వస్తున్న ఆయన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


నిష్పాక్షిక దర్యాప్తుకు హామీ :
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు విజయవాడ నుంచి అహ్మదాబాద్ చేరుకున్న ఆయన, ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు దాదాపు పూర్తయ్యాయని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. “ప్రయాణీకులు, వారి కుటుంబాలు, ఘటనా స్థలిలో మరణించిన వారి గురించే నేను ఆలోచిస్తున్నాను,” అని మంత్రి పేర్కొన్నారు. సహాయక చర్యల్లో సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, ఆరోగ్య, ఏవియేషన్ సిబ్బంది పాల్గొన్నారని ఆయన వివరించారు. మృతుల సంఖ్యను ఇప్పుడే నిర్ధారించలేమని, తప్పుడు సంఖ్యను చెప్పదలచుకోలేదని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు విదేశీయులు, పిల్లలు కూడా ఉన్నారని, ప్రతి ప్రాణం విలువైనదని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై నిష్పాక్షికమైన, సమగ్రమైన దర్యాప్తుకు హామీ ఇచ్చారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన ఎవరినీ విడిచిపెట్టబోమని, ఘటన ఎందుకు జరిగిందో లోతుగా విచారిస్తామని ఆయన ఉద్ఘాటించారు. ఇలాంటి దుర్ఘటన మళ్లీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News