రాష్ట్రంలోని మండల కేంద్రాలకు స్కూల్ బ్యాగ్ లను సకాలంలో చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంతరాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో ఆంక్షలు ఉన్నాయని, ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా స్కూల్ బ్యాగ్ లు తయారయ్యే ఫ్యాక్టరీ నుండి ట్రక్కుల ద్వారా రాష్ట్రంలోని మండల కేంద్రాలకు వాటిని తరలించే ప్రక్రియ సవాళ్లతో కూడుకున్నదన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/05/a4133b32-c238-4c0d-b175-83e176de5451-768x1024.jpg)
అంతరాష్ట్రాలను దాటి వచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 250 ట్రక్కుల ద్వారా స్కూల్ బ్యాగ్ లను రాష్ట్రానికి తరలించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. మండల కేంద్రాలను చేరడానికి ఒక్కో ట్రక్ రెండు మూడు రాష్ట్రాలను, మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలను దాటి స్టాక్ ను చేర్చాల్సి ఉండటంతో అంతరాష్ట్ర సరిహద్దులను దాటేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రతి ట్రక్కు డ్రైవర్ కు ఒక అండర్ టేకింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/05/fe0b60b9-3791-4edb-8397-b375b88d5ccf-768x1024.jpg)
ప్రతి చెక్ పోస్ట్ లో డ్రైవర్లు అండర్ టేకింగ్ చూపించడం ద్వారా స్టాక్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసి గమ్యస్థానాలను చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ నాణ్యత నియంత్రణ బృందానికి, ప్రతి సిబ్బందికి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/05/e6dcde73-69f3-4c74-9d28-2cd023ad108f-768x1024.jpg)