CJI BR GAVAI ON TECHNOLOGY: సాంకేతికత అనూహ్యమైన వేగంతో ప్రపంచాన్ని మార్చేస్తోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఈ మార్పు న్యాయవ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతోందన్నారు. యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ‘న్యాయం పొందే అవకాశాన్ని మెరుగుపరచడంలో సాంకేతికత పాత్ర’ అనే అంశంపై జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడారు. టెక్నాలజీని న్యాయ నిర్ణయాల్లో కాకుండా, విధులను మెరుగుపరచడానికి వాడాలని స్పష్టం చేశారు.
రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది :
సాంకేతికత రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని తెలిపిన జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఇది న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా డిజిటల్ విభజనకు కూడా దారితీసే అవకాశం ఉందన్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, డివైజ్లు, డిజిటల్ అక్షరాస్యత లేని అణగారిన వర్గాలను న్యాయం నుంచి మరింత దూరం చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే, మానవ పర్యవేక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా విధానపరమైన చట్రాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆయన సూచించారు.
సాంకేతికత ఒక వారధిగా నిలుస్తుంది :
భారత్ వంటి విస్తారమైన, వైవిధ్యమైన దేశంలో న్యాయం పొందడం ఒక సవాలు. 121 కంటే ఎక్కువ మాతృభాషలు మాట్లాడే గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయం అందించడంలో సాంకేతికత ఒక వారధిగా నిలుస్తుందని జస్టిస్ గవాయ్ నొక్కి చెప్పారు. వీడియో కాన్ఫరెన్సింగ్, సువాస్ (సుప్రీంకోర్టు విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్), నేషనల్ జుడిషియల్ డేటా గ్రిడ్ (NJDG) వంటి ఆవిష్కరణలు న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మారుమూల ప్రాంతాల న్యాయవాదులు దీల్లీకి ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే సుప్రీంకోర్టులో కేసులను వాదించే అవకాశం లభించడం, న్యాయం పొందేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని ఆయన ఉదహరించారు. మొత్తంగా, సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూనే, డిజిటల్ విభజనను తగ్గించి అందరికీ న్యాయం అందేలా చూడటంపై న్యాయవ్యవస్థ దృష్టి సారిస్తున్నట్లు సీజేఐ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు.