Hyderabad Real Estate Boom : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి తన సత్తా చాటుకుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) కాలనీలో జరిగిన ఈ-వేలంలో ఒక ఎకరం స్థలం రికార్డు స్థాయిలో రూ.70 కోట్లకు అమ్ముడైంది. నిన్నటి ఈ-వేలంలో, హౌసింగ్ బోర్డుకు చెందిన 7 ఎకరాల 33 గుంటల స్థలం కోసం జరిగిన పోటీలో, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు అయిన గోద్రెజ్ ప్రాపర్టీస్, అరబిందో రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ , అశోక బిల్డర్ వంటి సంస్థలు పాల్గొన్నాయి.
భారీ డీల్..
ఈ వేలంలో హౌసింగ్ బోర్డు ఎకరాకు కనీస ధరను రూ.40 కోట్లుగా నిర్ణయించింది. అయితే, బిడ్లో పాల్గొన్న సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ధర 46 సార్లు పెరిగింది. చివరికి, గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ ఎకరాకు రూ.70 కోట్ల చొప్పున ఈ స్థలాన్ని దక్కించుకుంది. మొత్తం రూ.547 కోట్ల భారీ మొత్తంతో ఈ డీల్ ఖరారైంది.
రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి
ఈ రికార్డు ధర హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో తెలియజేస్తుంది. గత కొన్నేళ్లుగా, హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం, మౌలిక సదుపాయాల కల్పన, నివాస ప్రాంతాల పెరుగుదల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం భారీగా వృద్ధి చెందుతోంది. హైదరాబాద్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్కు డిమాండ్ భారీగా పెరగడంతో, స్థలాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
హైటెక్ సిటీకి దగ్గరగా
కేపీహెచ్బీ వంటి నివాస ప్రాంతాలు, హైటెక్ సిటీకి దగ్గరగా ఉండటం వల్ల వాణిజ్య మరియు నివాస ప్రాజెక్టుల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలో మధ్య తరగతి , ఉన్నత వర్గాల ప్రజలకు గృహాల లభ్యత తగ్గిపోతున్న తరుణంలో, ఈ రికార్డు స్థాయి వేలం భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయని సూచిస్తుంది. హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకారం, ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద , మధ్య తరగతి ప్రజల కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉపయోగించనుంది. ఇది నగరంలో గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ డీల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలం , భవిష్యత్ సామర్థ్యానికి స్పష్టమైన ఉదాహరణగా చూపిస్తుంది.


