Narsing Graduates: నర్సింగ్ విద్యను ప్రోత్సహించి, గ్రామీణ యువతకు రాష్ట్రంలో, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు జపాన్, జర్మన్ వంటి దేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న నర్సింగ్ స్టూడెంట్స్కు ఇంగ్లిష్, జర్మన్ తదితర విదేశీ భాషలు నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా నర్సులకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని, గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసింది. అలాగే, 23 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలకు అనుమతించారు. దీనికోసం ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో (ఇఫ్లూ) సహకారంతో విద్యార్థులకు భాషలను నేర్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్లో గతేడాది 6,956 మంది నర్సులకు ఉద్యోగాలు ఇవ్వగా, ఈ ఏడాది మరో 2,322 మందికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. నర్సులకు ఉన్న డిమాండ్ను సానుకూలంగా మల్చుకుని రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే చర్యలపై కొంతమంది దురుద్దేశపూర్వకంగా బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని ఆరోగ్యశాఖ తీవ్రంగా ఖండించింది. నర్సింగ్ కాలేజీల అనుమతులపై తప్పుడు వార్తలు రాయించడం శోచనీయం అని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కూడా పదుల సంఖ్యలో ప్రైవేట్ నర్సింగ్, పారామెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చారని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో కొత్త హాస్పిటల్స్ ఏర్పడ్డాయని, ప్రభుత్వ హాస్పిటల్స్ సంఖ్య పెరిగిందని, హోమ్ కేర్ నర్సింగ్కు ప్రాధాన్యత ఏర్పడిందని, ఈ నేపథ్యంలో నర్సులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నర్సింగ్ విద్యను అభ్యసించే అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా కాలేజీల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరముందని వారు తెలిపారు. నర్సుల సుదీర్ఘ డిమాండ్ అయిన నర్సింగ్ డైరెక్టరేట్ సైతం ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఇదివరకే ఆమోదం తెలిపిందని వెల్లడించారు.


