KIDNEY DEMAND AS DOWRY : నవ భారత స్త్రీ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాలరాసే క్రూరత్వం భారతీయ సమాజంలో రోజు రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. నిత్యం ఎక్కడో ఓ చోట పితృస్వామ్య భావజాలం మహిళలపై ఏదో ఓ రకంగా హింస రచన చేస్తూనే ఉంది. అందులో భాగంగానే…కట్నం కింద డబ్బు బంగారం మాత్రమే కాదు, కిడ్నీ ఇవ్వాలంటూ కోడల్ని వేధించే అమానవీయ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
ఎంత నిరాకరించినా వేధింపులు ఆగలేదు :
బిహార్ రాష్ట్రం ముజఫర్పూర్లోని మిథన్పురాకు చెందిన మహిళకు, బోచహాన్ ఏరియాకు చెందిన వ్యక్తితో 2021 సంవత్సరంలో పెళ్లి జరిగింది. కొన్ని నెలల పాటు అన్నీ సవ్యంగానే సాగాయి. కానీ ఆ తర్వాతే ఆమె జీవితంలో చీకటి రోజులు మొదలయ్యాయి. అత్తామామల నిజ స్వరూపం బయటపడింది. “పుట్టింటి నుంచి డబ్బు, బైక్ తీసుకురా” అంటూ కోడలిని వేధించడం ప్రారంభించారు. ఆమె ఎంత నిరాకరించినా, వారి వేధింపులు ఆగలేదు. మాటలతో మానసికంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు.
కిడ్నీ ఇవ్వాలంటూ బెదిరింపులు :
కట్నం వేధింపులతో సతమతమవుతున్న ఆమెకు మరో షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లయిన దాదాపు రెండేళ్ల తర్వాత తన భర్త కిడ్నీలలో ఒకటి చెడిపోయిందని ఆమెకు అర్థమైంది. ఈ విషయం తెలుసుకున్న అత్తామామలు మరింత దారుణంగా మారారు. “కట్నం తీసుకురాలేకపోతే పర్లేదు, కానీ మా అబ్బాయికి ఒక కిడ్నీ ఇవ్వు” అంటూ బెదిరించడం మొదలుపెట్టారు. ప్రాణం నిలబెట్టే అవయవాన్ని కట్నంగా అడగడం ఆ మహిళకు దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె నిరాకరిస్తూ వచ్చినా, అత్తామామలు ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఆమెను మానసికంగా కృంగదీశారు.
ఇంటి నుంచి గెంటివేత, పోలీసులకు ఫిర్యాదు :
ఈ టార్చర్ ఇటీవలే పరాకాష్టకు చేరింది. భర్త కూడా అత్తామామలకు తోడై, కట్నం కింద కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరిస్తోందని ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశారు. చేసేదేమీ లేక, ఆ బాధిత మహిళ నేరుగా మిథన్పురాలోని తన పుట్టింటికి వెళ్లింది. తనకు జరిగిన అన్యాయంపై అక్కడి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఇరువర్గాలను పిలిచి రాజీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. చివరికి, వరకట్నంగా కిడ్నీ అడిగారనే అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధిత మహిళ భర్త, అత్తామామలు సహా మొత్తం నలుగురిని నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ముజఫర్పూర్ రూరల్ ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఈ అమానుష ఘటన భారతీయ సమాజంలో పాతుకుపోయిన వరకట్న దురాచారం ఎంత దారుణంగా పరిణమించిందో తెలుపుతుంది.