Ponguleti Srinivasareddy:ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు బుధవారం సచివాలయంలో వరద సహాయక చర్యలపై శాఖల వారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సుల్తానియాతో కలిసి పొంగులేటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందన్నారు. సహాయక పనులను మరింత వేగవంతం చేయాలని, ఇప్పటి వరకు పరిహారాలు విడుదల చేయకపోతే వాటిని వెంటనే విడుదల చేయాలని సూచించారు. ఏ ఒక్క బాధితుడు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. చెరువులు, కుంటలు, రోడ్ల మరమ్మతులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు రూ.5 కోట్లు విడుదల చేశామని చెప్పారు. సహాయక చర్యలను కలెక్టర్లతో సమన్వయం చేసుకొని హైదరాబాద్ నుంచి ఆయా విభాగాధిపతులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వరద సహాయానికి సంబంధించి వినియోగించిన నిధులకు యూసీలను కేంద్రానికి అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 13వ తేదీలోగా ఆయా విభాగాలు యూసీలను సమర్పించాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, హెల్త్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలపై సమీక్ష
నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం సచివాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీపీఆర్వో జి. మల్సూర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ విధానం, హెల్త్ పాలసీ, అవార్డులు, దాడులకు సంబంధించి హైపవర్ కమిటీ తదతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా అంశాలపై కార్మిక, ఆరోగ్య, హోం, ఆర్థిక శాఖ అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.


