సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే అమరావతిలో నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి పరుష పదజాలంతో విమర్శించారు. నిరసన తెలిపే మహిళలను సంకర జాతిగా సంబోధించారు. అంతేకాకుండా వారిని పిశాచులు, రాక్షసులుగా అభివర్ణించారు. సజ్జల వ్యాఖ్యలపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే, వారిని వైసీపీ నాయకులు ‘సంకరజాతి’ అని అభివర్ణించడం దారుణమని మండిపడ్డారు. “ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన?” అంటూ ఆగ్రహించారు.
మహిళల పట్ల వైసీపీ నాయకులు, సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారని.. ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు!” అని నిలదీశారు.
వైసీపీ నేతల ప్రవర్తన, జగన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని తరిమేసిన అమానవీయ తీరును ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉందని విమర్శించారు. మహిళల జోలికి వస్తే, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. కాగా సాక్షి ఛానల్ డిబేట్ లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోలీసులు యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.