NAUBAT MUSICAL INSTRUMENT IN TOMB: గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం, కేవలం ఒక మహానగరం కాదు, అది చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఎన్నో సంప్రదాయాలకు, విశేషాలకు నిలయం. ఈ నగర నిర్మాత, సుల్తాన్ అహ్మద్ షా సమాధి వద్ద దాదాపు 600 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన ఆచారం కొనసాగుతోంది. శతాబ్దాలు గడిచినా, తరాలు మారినా, ఈ సంప్రదాయం చెక్కుచెదరక, నాటి రాజుల వైభవాన్ని, క్రమశిక్షణను నేటికీ గుర్తుచేస్తోంది.
అహ్మద్ షా సమాధి వద్ద:
చక్రవర్తి అహ్మద్ షా పాలనా కాలంలో, ఒక ప్రత్యేక ఆచారం ఉండేది. ప్రతీ రాత్రి 11 గంటలకు, నగరాన్ని రక్షించే కోటలోని 12 ద్వారాలను మూసివేసేవారు. ఈ సమయాన్ని ప్రజలకు తెలియజేయడానికి, “నౌబత్” అనే ఒక ప్రత్యేకమైన సంగీతాన్ని వాయించేవారు. ఈ ధ్వని ప్రజలకు ఒక హెచ్చరిక, తమ దైనందిన కార్యక్రమాలను ముగించుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సంకేతం. ఆనాటి రాజుల దార్శనికత, ప్రజల భద్రత పట్ల వారి నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం.
కాలక్రమేణా రాజ్యాలు మారినా, పాలకులు మారినా.. ఈ ‘నౌబత్’ ఆచారం మాత్రం అహ్మద్ షా సమాధి వద్ద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఏంటి ఈ నౌబత్?
నౌబత్ అంటే కేవలం ఒక పాట కాదు, ఇది ఒక పాత కాలం నాటి సంగీత పద్ధతి. రాజు వస్తున్నాడని, వెళ్తున్నాడని చెప్పడానికి, ముఖ్యమైన అతిథులను స్వాగతించడానికి, లేదా రాజ కుటుంబంలో పుట్టినరోజులు, పెళ్లిళ్లు, మరణాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ నౌబత్ వాయించేవారు. ఈ నౌబత్ సంగీతం వినడానికి దేశం నలుమూలల నుంచి చాలా మంది వస్తుంటారు.
అహ్మద్ షా సమాధి దగ్గర ఒక పాత గేటు ఉంటుంది. దాన్ని “నౌబత్ ఖానా” అంటారు. అంటే, “సంగీతం వాయించే గది” అన్నమాట. ఈ సంప్రదాయాన్ని తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందినట్లు అమీర్ మియా షేక్ అనే సంగీతకారుడు తెలిపారు. గురువారం, శుక్రవారం రోజుల్లో ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 3 గంటలకు, రాత్రి 7 గంటలకు, మళ్లీ రాత్రి 11 గంటలకు – ఇలా రోజుకు ఐదు సార్లు నౌబత్ వాయిస్తామని చెప్పారు. ఈ నౌబత్ను వాయించడానికి షెహనాయ్, నగర, తబలా అనే మూడు సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తారని వివరించారు.