Iran Israel War : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్లో చిక్కుకుపోయిన భారత పౌరులను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధు’ విజయవంతంగా ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా మొదటి దశలో 110 మంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 90 మంది జమ్మూకశ్మీర్కు చెందినవారు కావడం విశేషం. బుధవారం అర్మేనియా రాజధాని యెరవాన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం, గురువారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకోగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ విద్యార్థులకు స్వాగతం పలికారు.
స్వదేశం చేరిన విద్యార్థులు: ఇరాన్ నుంచి సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, అక్కడి పరిస్థితులు, తమ భవిష్యత్ చదువుల గురించి వారు ఆందోళన చెందుతున్నారు. “ఇరాన్లో పరిస్థితి భయంకరంగా ఉంది, ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో బతుకుతున్నారు” అని వారు తెలిపారు. తమను సురక్షితంగా తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ పెద్ద పాత్ర పోషించారని, ప్రతి దశలో అండగా నిలిచారని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇరాన్లో ఇంకా 4 వేల మంది భారతీయులు : ప్రస్తుతం ఇరాన్లో సుమారు 4 వేల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో సగం మంది విద్యార్థులేనని అంచనా. యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారతీయులు లేరని, ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిందని తెలుస్తోంది.
టెహ్రాన్ను వీడండి: భారత ఎంబసీ కీలక హెచ్చరిక
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది. టెహ్రాన్లో ఉన్న భారతీయ పౌరులు వెంటనే నగరాన్ని విడిచిపెట్టి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇంకా ఎంబసీని సంప్రదించని భారతీయులు ఎవరైనా ఉంటే, వెంటనే దౌత్యాధికారులను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
Operation Sindhu : ఇరాన్ నుంచి స్వదేశానికి 110 మంది విద్యార్థులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES