Rabindranath Tagore Home Vandalise: “ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ తల పైకెత్తుతుందో… అటువంటి స్వేచ్ఛా స్వర్గంలోకి, నా తండ్రీ, నా దేశాన్ని మేలుకొలుపుము,” అని తన అమర కవితలో ఆకాంక్షించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. భారత్, బంగ్లాదేశ్లకు జాతీయ గీతాలను అందించిన నోబెల్ పురస్కార గ్రహీత ఆశలు, ఆశయాలు ఆదర్శంగా నిలిచిన పవిత్ర స్థలంపై దారుణమైన దాడి జరిగింది. బంగ్లాదేశ్లోని సిరాజ్గంజ్ జిల్లాలో ఉన్న ఠాగూర్ పూర్వీకుల నివాసం, ‘రవీంద్ర మెమోరియల్ మ్యూజియం’పై అల్లరి మూక దాడి చేసింది. ఈ ఘటపై యావత్ సాంస్కృతిక ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఒక చిన్న వివాదం… పెద్ద విధ్వంసానికి దారి తీసింది :
ఒక చిన్నపాటి పార్కింగ్ ఫీజు వివాదం, మ్యూజియం సిబ్బందికి, సందర్శకుడికి మధ్య ఘర్షణకు దారితీసి, అది స్థానికుల ఆగ్రహంతో మ్యూజియం ఆడిటోరియం ధ్వంసానికి, డైరెక్టర్పై దాడికి కారణమైంది.
చరిత్రపై జరిగిన దాడి… మానవజాతి వారసత్వంపై గాయం :.
ఠాగూర్ ఎన్నో అద్భుత రచనలు చేసిన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ‘కచహరిబాడీ’ విధ్వంసానికి గురైంది. ఒకప్పుడు రెవెన్యూ కార్యాలయంగా కూడా సేవలందించింది. అలాంటి చారిత్రకా స్థలం ఇప్పుడు విధ్వంసానికి గురైంది. ఈ ఘటన కేవలం ఒక భవనంపై జరిగిన దాడి మాత్రమే కాకుండా నాగరికతపై, కళలపై, చరిత్రపై జరిగిన దాడిగా ప్రజలు పేర్కొంటున్నారు.
దర్యాప్తు, చర్యలు:
ఈ దారుణంపై బంగ్లాదేశ్ పురావస్తు శాఖ తక్షణమే స్పందించి, ముగ్గురు సభ్యులతో కూడిన దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి మ్యూజియంలోకి సందర్శకుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.