Tragedy Ahmedabad plane crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో లండన్కు వెళ్తున్న డాక్టర్ ప్రతీక్ జోషి, డాక్టర్ కోమి వ్యాస్ దంపతులు చివరి సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్ నుంచి మరణించిన పది మందిలో ఐదుగురు ఒకే కుటుంబం కావడం అందరి హృదయాలను కలచివేస్తోంది.
కాలిబూడిదైన కలలు… ఆవిరైపోయిన ఆశలు
అది అహ్మదాబాద్ నగరం, సమయం ఉదయం 1:38 గంటలు అవుతుంది. ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో గమ్యాన్ని చేరేందుకు ప్రయాణికులు, చేర్చేందుకు ఎయిర్ ఇండియా విమానం సిద్ధమైనది. అందులో లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న డాక్టర్ ప్రతీక్ జోషి మొత్తం కుటుంబం ఉంది. అది, ఆరేళ్లుగా తన కుటుంబాన్ని లండన్ తీసుకెళ్లాలి అనుకుంటున్నా జోషి కల. భర్త కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం కుటుంబంతో ఆనందంగా ఉండాలని డాక్టర్ వృత్తిని వదిలేసి మరి వెళ్తోంది డాక్టర్ కోమి వ్యాస్. వారి ఆశయాలు ఆకాంక్షలు మరి కొద్ది ఘడియల్లో నిజం కాబోతున్నాయి.
నిన్నటి సెల్ఫీలోని నవ్వులు… నేడు విషాద స్మృతులు ఈ సంతోష క్షణాలను జ్ఞాపకంగా పదిలపరిచేందుకు జోషి, కోమి దంపతులు వారి తొమ్మిదేళ్ల కూతురి ఆనందాలను, ఐదేళ్ల కవలపిల్లల చిరునవ్వులను, పోగేసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. అదే విమానంలో వారు తీసుకున్న ఆఖరి సెల్ఫీ.. లండన్లో స్థిరపడాలనే ఎన్నో ఆశలతో పయనమైన వారి ఆనందం ఆవిరి అయిపోయింది. విరిసిన నవ్వులు, మెరిసిన ఆశలు నింగికేగిసిన స్వప్నం… కాలిబూడిదైన కథగా మిగిలిపోయింది. నిన్నటి సెల్ఫీలోని నవ్వులు… నేడు విషాద స్మృతులుగా మిగిలాయి. ఈ హృదయ విదారక గాథ అందరి గుండెలని పిండేస్తుంది. ప్రతీక్ జోషి కుటుంబం విమానంలో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజస్థాన్కు చెందిన మొత్తం 10 మంది మృతుల్లో ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం ఆ విషాద గాథకు మరింత తీవ్రతను జోడిస్తుంది.