TRUMPS SECOND CHANCE FOR IRAN :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. “మారణహోమాన్ని ఆపేందుకు రెండో అవకాశం” ఇస్తున్నామని ప్రకటించిన ట్రంప్, ఇరాన్ త్వరగా అణు కార్యక్రమాన్ని ఆపే ఒప్పందం కుదుర్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా జాతీయ భద్రతా బృందంతో సమావేశం అనంతరం ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు, ఇరాన్ పట్ల అమెరికా కఠిన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో తమ పాత్ర లేదని వైట్హౌస్ ప్రకటించినప్పటికీ, ట్రంప్ మాటలు దానికి భిన్నంగా ఉన్నాయి. ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచి, అమెరికా-ఇరాన్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మా ఆయుధాలే వాడరు : ట్రంప్
ఇరాన్లోని నతాంజ్ యురేనియం శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడికి అమెరికా ఆయుధాలనే వాడిందని ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు, ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రాం కేంద్రాలు, అలాగే కీలక శాస్త్రవేత్తలు, అధికారులపై జరిగిన దాడులకు కూడా తమ ఆయుధాలే ఉపయోగించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇది అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
దాడులు చేయిస్తూ చర్చలకు పిలుస్తారా..?
ఇజ్రాయెల్ దాడులకు అమెరికా మద్దతు ఇస్తున్నందున అణు కార్యక్రమంపై చర్చలు అర్థరహితమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై అన్నారు. ఒకవైపు దాడులకు మద్దతిస్తూ, మరోవైపు చర్చలకు ఆహ్వానించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ తమపై దాడి చేయదని బఘై అన్నారు. ఒమన్ మధ్యవర్తిత్వంలో ఏప్రిల్ నుంచి జరుగుతున్న అణు ఒప్పంద చర్చల్లో జూన్ 15న జరగాల్సిన ఆరో విడత చర్చలపై ఇంకా స్పష్టత లేదని ఇరాన్ మీడియా వెల్లడించింది.
ఇద్దరు ఇరాన్ సైనిక ఉన్నతాధికారుల మృతి
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు చెందిన మరో ఇద్దరు ఉన్నత స్థాయి ఆర్మీ జనరల్స్, గులామ్ రిజా మెహ్రాబీ (ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్) మరియు మెహదీ రబ్బానీ (ఆపరేషన్స్ విభాగంలో కీలక పాత్రధారి) మరణించినట్లు నిర్ధారించారు. అయితే, వారి మరణించిన ప్రదేశం, సమయం గురించి వివరాలు వెల్లడించలేదు. ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధిపతి కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే