Friday, July 5, 2024
Homeపాలిటిక్స్Andole: రసవత్తర రాజకీయం, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికో ?

Andole: రసవత్తర రాజకీయం, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికో ?

ఉమ్మడి మెదక్ జిల్లాలో పేరుగాంచిన అతిపెద్ద నియోజకవర్గం ఆందోలు. ఈ నియోజకవర్గంలో 9 మండలాలు ఉన్నాయి. అందరి చూపు ఆందోలు నియోజకవర్గం వైపే. ఎందుకంటే ఆందోలు నియోజకవర్గం నుండి ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుపొందుతారు అదే పార్టీ రాష్ట్రంలో గద్దెనెక్కుతుందని నానుడి ఉంది. దీంతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆందోల్ నియోజకవర్గం పై ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. ఈ నియోజకవర్గంలో గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కూడా దక్కుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన దామోదర్ రాజనర్సింహ ఉపముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.

- Advertisement -

అలాంటి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా ఆందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందింది డాక్టర్ బాబు మోహన్. ఆయన టీఆర్ఎస్ కు దూరమయ్యాక జర్నలిస్ట్ నాయకునిగా పేరున్న క్రాంతి కిరణ్ టీఆర్ఎస్ టికెట్ పై ఆందోల్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ అని కేసీఆర్ చెప్పాక ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అంతవరకూ ఒకటిగా ఉన్న అధికార పార్టీలో గ్రూపులు, విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం వీరు మూడు గ్రూపులుగా చీలిపోయారు. అందులో ఒకరు తెలంగాణ రాష్ట్ర జడ్పీటీసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఖాదిరాబాదు రమేష్. ఈయన ఎంపీటీసీగా గెలుపొంది ఆందోల్ మండలం వైస్ ఎంపీపీగా పనిచేశారు. అనంతరం అందోలు జడ్పీటీసీగా గెలుపొంది తెలంగాణ రాష్ట్ర జడ్పీటీసీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్రాంతికు ఈయనకు మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గు మనే స్థాయిలో విభేదాలు వచ్చాయి. క్రాంతికి దూరంగా ఉంటూ సాంఘిక మాధ్యమాలలో ఎమ్మెల్యే టికెట్ నాకే అని ప్రచారం జోరుగా చేసుకుంటున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో పేరుగాంచిన కుటుంబం మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి కుటుంబం. ఈ కుటుంబం గులాబీ దళపతికి సన్నిహితుల కుటుంబం దాని మూలంగానే క్రాంతి కిరణ్ కు గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన మాణిక్ రెడ్డి సోదరుడు జైపాల్ రెడ్డి వర్గం సైతం ఎమ్మెల్యేకు దూరం దూరంగా ఉంటున్నారు. దాంతో జైపాల్ రెడ్డి వర్గం రాబోయే ఎన్నికలలో ఎవరికి మద్దతిస్తారనే విషయం ఆసక్తిగా మారింది. ట్రబుల్ షూటర్ గా పేరొందిన జిల్లా మంత్రి హరీష్ రావు సైతం మూడు ముక్కలుగా విడిపోయిన వీరిని ఒక తాటిపైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. హరీష్ రావు మాటను సైతం జైపాల్ రెడ్డి వర్గం బేఖాతరు చేస్తూ ఉండటంతో రాబోయే ఎన్నికలలో అభ్యర్థిని మార్చే యోచనలో రాష్ట్ర కార్యవర్గం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News