Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్CM Revanth: 15,000 పోస్టులు @ 15 రోజుల్లో

CM Revanth: 15,000 పోస్టులు @ 15 రోజుల్లో

గ్రూప్​ 1 ఖాళీలు 60

రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని నిరుద్యోగులంబరూ పోటీ పరీక్షలకు సిద్దం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. పదేండ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32 లక్షల మంది నిరుద్యోగుల్లో విశ్వాసం నింపేందుకు తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

- Advertisement -

గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. సింగరేణిలో 441 మందికి హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్​తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 412 మందికి కారుణ్య నియామక పత్రాలు, 29 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశారు. వీరిలో బ‌దిలీ వ‌ర్క‌ర్లు, జూనియ‌ర్ అసిస్టెంట్లు, మోటారు మెకానిక్‌లు ఉన్నారు.

ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనంగా, అంబేడ్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు తెలంగాణ సాదనలో వైఫల్యం చెందినా కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని ఆయన అన్నారు. కేంద్రం కూడా సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్ కు అండగా నిలిచి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వేలాది ఓట్ల మెజారిటీ రావడం వెనుక సింగరేణి కార్మికుల కృషి వుందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల అధికారంలో వున్న బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని సిఎం అన్నారు.

సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటివలే తాను ఆదేశించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. కారుణ్య నియామకాల వయస్సు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కోవా లక్ష్మీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి ఎండి బలరాం నాయక్, ఐ.ఎన్.టి.యు.సి జనరల్ సెక్రటరీ జనప్రసాద్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News