Saturday, July 27, 2024
Homeపాలిటిక్స్CM Revanth Reddy: బూడిదైన బీఆరెస్ మళ్లీ పుట్టదు-సీఎం రేవంత్

CM Revanth Reddy: బూడిదైన బీఆరెస్ మళ్లీ పుట్టదు-సీఎం రేవంత్

గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత నాదే

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని, వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగామన్నారు సీఎం రేవంత్.

- Advertisement -

రెఫరండం అన్నాగా..

ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పామని, 17పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని, ఈ ఎన్నికల్లో 41శాతం ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయని, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.5శాతం ఓట్లు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ ఎన్నికల్లో మా ఓట్ల శాతం పెరిగిందని చెప్పిన సీఎం, మా పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ఫలితాలతో అర్ధమవుతోందన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించి ప్రజలు మాకు మరో సీటు అదనంగా ఇచ్చారని, 2019లో బీజేపీ 4 గెలిస్తే.. ఈ ఎన్నికల్లో 8 స్థానాలు, అసెంబ్లీ ఎన్నికల్లో 20శాతం ఉన్న ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో 35శాతానికి పెరిగాయన్నారు.

ఓట్లు, సీట్లు పెరిగాయి..

బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవదానం చేశారని, బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆరెస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ తమ ఓట్లను పూర్తిగా బీజేపీ కి బదిలీ చేశారన్నారు. రఘునందన్ రావుకు ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీన వర్గాల బిడ్డను ఓడించారని సీఎం ఆరోపించారు. వెంకట్ రామ్ రెడ్డిని నమ్మించి మోసం చేసి మరీ కేసీఆర్ బీజేపీని గెలిపించారని, అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు పొందిన బీఆరెస్ ఈ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపోయిందన్నారు.

2023లో 13శాతం ఓట్లున్న బీజేపీకి.. ఈ ఎన్నికల్లో 35.5 శాతంకు ఓట్లు పెరిగాయని, రాష్ట్రంలో బీఆరెస్ ఎమ్మెల్యేల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ , కేటీఆర్, హరీష్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. పూర్తిగా ఓట్లను బదలాయించి కేసీఆర్ రాజకీయ ఆరాచకానికి పాల్పడ్డారని, రాష్ట్రంలో తనంతట తానే అంతర్ధానం అయ్యి బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలిచారన్నారు. బూడిదైన బీఆరెస్ మళ్లీ పుట్టేది లేదని, వంద రోజుల్లోనే మాపై ఆరోపణలు చేసిన బీఆరెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

గులాబీ కుట్రలన్నీ..

కుట్రపూరితంగా వ్యవహరించిన బీఆరెస్ ను ప్రజలు తిరస్కరించారని, ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోవాలని బీఆరెస్ కు సూచన చేస్తున్నానన్నారు. హరీష్… ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ ను దెబ్బతీయాలనుకుంటే చివరికి కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతారని, మోదీ గ్యారెంటీ పేరుతో బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారని, బీజేపీ 303 సీట్ల నుంచి 243కి పడిపోయిందన్నారు. మోదీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారని, దేశ ప్రజలు మోదీని తిరస్కరించారని, తక్షణమే మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మళ్లీ ప్రధాని పదవి చేపట్టరాదు..

ప్రజల తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదని, విలువలు కలిగిన నాయకుడిగా హుందాగా తప్పుకుంటే మోదీకి గౌరవం ఉంటుందని రేవంత్ అనటం విశేషం. ఇప్పటికైనా బీజేపీ అప్రజాస్వామిక తీరును మార్చుకోవాలని, ఇప్పటివరకు 18 గంటలే పనిచేసాం.. ఇకనుంచి మరో రెండు గంటలు ఎక్కువ పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత నాదేనన్న రేవంత్..వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివన్నారు.

బీజేపీతో బేరసారాలా!

కేసీఆర్ బీజేపీ తో బేరసారాలు చేస్తున్నాడని, బీఆరెస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రభోదానుసారం వ్యవహరించాలన్నారు. కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు… ఆయన ఉన్నంత కాలం కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు అన్న బీజేపీ… బీఆరెస్ తో ఎలా జతకడుతుందో చూడాలన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు రేవంత్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News