ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రం అవుతోందని, అందువల్ల పార్టీ నాయకత్వమంతా సమష్టిగా కృషి చేయాలని, సీఎం చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండ గట్టాలని సమావేశంలో సీనియర్ నేతలకు వైయస్ జగన్ సూచించారు.
తాజా రాజకీయాలపై జగన్
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో, అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయి వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఇటీవల సీఎం చంద్రబాబు మాటలు, ప్రకటనలు తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. సూపర్సిక్స్ హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా ఏవేవో సాకులు చెబుతూ అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/feeb6b18-b04f-4d84-990a-1d51c058982a-1024x444.jpg)
ప్రజల్లోకి వంచన-మోసాలు
వీటన్నింటి నేపథ్యంలో చంద్రబాబు వంచన, దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని వైయస్ జగన్ సూచించారు.
పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, పేర్ని కిట్టు, కొట్టు సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నందిగం సురేష్, ఎస్వీ మోహన్రెడ్డి, కైలే అనిల్కుమార్, కావటి మనోహర్నాయుడు, కె.సురేష్బాబు, గోరంట్ల మాధవ్, ఈపూరు గణేష్, ఆలూరు సాంబశివారెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వంకా రవీంద్రనాథ్, అదీప్రాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.