ఐపీఎల్లో(IPL 2025) ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన మజా చూపించింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో ఢిల్లీ ఆటగాళ్లు పోరాడిన తీరు గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాడు అశుతోష్ శర్మ(Ashutosh Sharma) ఆడిన తీరు ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 209/8 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(72), నికోలస్ పూరన్(75) ఫోర్లు, సిక్సర్లతో రాణించారు. ఇక 210 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అయితే విప్రోజ్ నిగమ్, అశుతోష్ పోరాటపటిమతో ఆ జట్టు మళ్లీ రేసులోకి వచ్చింది. ఓటమి నుంచి జట్టును విజయ తీరాలవైపు నడిపించారు. లక్నో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి క్రీజులో పాతుకుపోయారు. విప్రజ్ 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి ఔట్ అవడంతో విజయం దోబూచులాడింది. అయితే అశుతోష్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులతో ఏమాత్రం భయపడకుండా క్రీజులో నిలబడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మణిమరన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అద్భుత బ్యాటింగ్తో జట్టుకు విజయాన్ని అందించిన అశుతోష్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant) ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో పంత్ ఆరు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్ని బాల్స్ ఆడి డకౌట్గా నిలిచిన ఆటగాడిగా నిలిచాడు.