మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్ -19 మహిళల టీ20(U-19 T20 World Cup) ప్రపంచకప్ ముగిసింది. ఈ టోర్నీలో విశ్వవిజేతగా భారత్ నిలిచింది. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్లోనూ 33 బంతుల్లోనే 44 పరుగులు చేసి అదరగొట్టింది.
ఇక ఈ టోర్నీలో ఆడిన ఏడు ఇన్నింగ్స్ల్లో 76.25 సగటుతో 147.34 సగటుతో 305 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ చేసింది. స్కాట్లాండ్ పై 110 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. దీంతో ఫైనల్ మ్యాచ్తో పాటు టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన త్రిషకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గ్రహీత, భారత మహిళల జట్టు మాజీ క్రికెటర్ నీతూ డేవిడ్ చేతుల మీదుగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకుంది. కాగా త్రిష స్వస్థలం తెలంగాణలోని భద్రాచలం. చిన్నప్పటి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న త్రిష 9 ఏళ్ల వయసుకే హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఎంపికై సత్తా చాటింది. ఆ తర్వాత అండర్-23 కేటగిరీలోనూ ఆడింది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించి ఆల్ రౌండర్గా పేరు సంపాందించుకుంది. భారత్ విశ్వవిజేతగా నిలవడంతో తెలంగాణ అమ్మాయి కీలక పాత్ర పోషించడం తెలుగు వారందరికీ గర్వకారణం.