IND-W vs AUS-W Highlights: ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో భారత్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఆసీస్ కెప్టెన్ అలిస్సా హీలీ అద్భుతమైన సెంచరీ చేసి తన జట్టును గెలిపించుకుంది. తాజా విజయంతో కంగూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఓడిపోయిన భారత్ జట్టు మూడో స్థానానికి దిగజారింది.
మ్యాచ్ సాగిందిలా..
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధాన శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ తొలి వికెట్ కు 155 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఈ జంట హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సోఫీ విడదీసింది. స్మృతి(80)ని ఔట్ చేసి ఆసీస్ కు బ్రేక్ ఇచ్చింది. కాసేపటికే ప్రతీకా రావల్(75) కూడా ఔటైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్లిన్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ నిలకడగా ఆడారు. వీరిద్దరూ కూడా స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అనంతరం రిచ్ ఘోష్ కొన్ని మెరుపులు మెరిపించినప్పటికీ.. మిగతా వారు ఆమెకు సహకరించకపోవడంతో టీమ్ ఇండియా 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో సదర్ లాండ్ ఐదు వికెట్లుతో సత్తా చాటింది.
హీలీ కెప్టెన్ ఇన్నింగ్..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు ఓపెనర్లు అలిస్సా హీలీ, లిచ్ ఫీల్డ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 85 పరుగుల జోడించారు. 40 పరుగులు చేసిన లిచ్ ఫీల్డ్ ను శ్రీ చరణి ఔట్ చేసి ఇండియాకు బ్రేక్ ఇచ్చింది. అయితే మరో ఎండలో కెప్టెన్ అలిస్సా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో కెప్టెన్ అలిస్సా హీలీ సెంచరీ కూడా చేసింది. ఈమె ఔటైనా తర్వాత భారత్ బౌలర్లు విజృంభించి వికెట్లు తీసినప్పటికీ కంగూరు జట్టు ఓవర్ ఉండగానే టార్గెట్ ను ఛేదించింది. చివరిలో ఎలీసా పెర్రీ(47 నాటౌట్), గార్డ్నర్ (45)లు మంచి ఇన్నింగ్స్ ఆడారు. శ్రీచరణ్ కు మూడు వికెట్లు దక్కాయి. మెుత్తానికి రెండు జట్లు కలిపి 661 పరుగులు చేశాయి.


