భారత్, ఇంగ్లాండ్(IND vs ENG) జట్ల మధ్య మూడో వన్డే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత బ్యాటర్లు అదరగొట్టారు. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగానే పెవిలియన్కు చేరినా.. శుభ్మన్ గిల్, కోహ్లీ అదరగొట్టారు. గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఇక స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. 55 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్తో 52 పరుగులు చేశాడు.
అలాగే శ్రేయస్ అయ్యర్ మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు. 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులతో రాణించాడు. చివర్లో కేఎల్ రాహుల్(40), పాండ్య (17), వాషింగ్టన్ సుందర్ (14), అక్షర్ పటేల్ (13), హర్షిత్ రాణా (13) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4, మార్క్వుడ్ 2, సకిబ్, అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇక ఈ మ్యాచ్లో భారత్ మూడు మార్పులతో బరిలో దిగింది. జడేజా, వరుణ్, షమీ స్థానంలో సుందర్, కుల్దీప్, అర్షదీప్ జట్టులోకి వచ్చారు. ఇక మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే టీమిండియా రెండు మ్యాచ్లు గెలిచి 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో ఇవాళ జరిగే మూడో వన్డే నామమాత్రంగా మారింది. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తుంటే.. చివరి మ్యాచైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లాండ్ జట్టు పట్టుదలతో ఉంది.