India vs New Zealand ICC Women’s World Cup 2025: నవీ ముంబయి వేదికగా మహిళల వన్డే ప్రపంచ కప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో భారత్ బ్యాటింగ్లో అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారీ స్కోరు చేసింది. 48 ఓవర్ల ఆట తర్వాత వరుణుడు ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (122; 134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లు), స్మృతి మంధాన (109; 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీలతో మెరిశారు. ఈ జోడీ మొదటి వికెట్కు రికార్డు స్థాయిలో 201 బంతుల్లో 212 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (76; 55 బంతుల్లో 11 ఫోర్లు) మెరుపులు మెరిపించింది. ఈ ముగ్గురూ ధాటిగా ఆడటంతో 45 ఓవర్లకే జట్టు స్కోరు 300 దాటింది. దీంతో న్యూజిలాండ్ ముందు భారత్ కొండంత లక్ష్యాన్ని నిలిపింది. అమేలియా కెర్, సుజీ బేట్స్, రోజ్మేరీ మెయిర్ తలో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోస్మేరీ మైర్, అమేలియా కెర్, సూజీ బేట్స్కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే 49 ఓవర్లలో 341 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో మొదటి మూడు సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
సెమీస్కు బెర్తు దక్కాలంటే ఇదే కీలక మ్యాచ్..
అయితే, ఈ పోరులో గెలిస్తేనే.. ఇండియాకు సెమీస్ బెర్త్ దక్కుతుంది. ఒకవేళ ఓడితే ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్.. న్యూజిలాండ్ను ఓడించాలి. అదే టైమ్లో బంగ్లాదేశ్పై ఇండియా కచ్చితంగా నెగ్గితేనే హర్మన్సేనకు నాకౌట్ బెర్త్ ఖాయమవుతుంది. ఈ నేపథ్యంలో బాగా పట్టున్న డీవై పాటిల్ స్టేడియంలో కివీస్తో జరిగే ఈ పోరులోనే కచ్చితంగా గెలవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్తో జరిగిన గత మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడినా ఓటమి ఎదురుకావడాన్ని ఇండియా జీర్ణించుకోలేకపోతున్నది. ఇక, భారత మహిళా జట్టు తరఫున ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్ ఆడుతున్నారు. ఇక, న్యూజిలాండ్ మహిళల జట్టు తరఫున సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్ (కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గేజ్ (వికెట్ కీపర్), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, లియా తహుహు, ఈడెన్ కార్సన్ ఆడుతున్నారు. అద్భుతమైన ఆట తీరుతో భారత మహిళా జట్టు రాణిస్తోంది.


