ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సొంతం చేసుకుంది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగడంతో.. 305 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 44.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించింది. రోహిత్ కు తోడు శుభ్ మన్ గిల్ 60 పరుగులతో రాణించాడు, ఇక అక్షర్ పటేల్ (41) శ్రేయస్ అయ్యర్ (44) రాణించారు. అయితే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నిరాశ పరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్, గుస్ అట్కిన్సన్ తలా ఓ వికెట్ సాధించారు.
305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు శుభారంభం ఇచ్చారు. పేలవ ఫామ్ తో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. ఆ తర్వాత కూడా అదే దూకుడుతో ఆడాడు. మరోవైపు గిల్ ఆరంభంలో క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారి కుదురుకున్నాక తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. 45 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగానే ఆడే క్రమంలో జామీ ఓవర్టన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 136 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అయితే వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ (5) విఫలం అయ్యాడు.
కోహ్లీ ఔటైన తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో జత కలిసిన హిట్ మ్యాన్ విధ్వంసాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో 76 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది 32వ శతకం కావడం విశేషం. సెంచరీ అనంతరం కూడా వేగంగానే ఆడాడు. ఈ క్రమంలో లియామ్ లివింగ్ స్టన్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి ఆదిల్ రషీద్ క్యాచ్ అందుకోవడంతో రోహిత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. రోహిత్, అయ్యర్ జోడి మూడో వికెట్ కు 70 పరుగులు నమోదు చేశారు. మరోవైపు ఫామ్ ను కొనసాగించిన అయ్యర్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అయితే.. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ (10), హార్దిక్ పాండ్యా (10)లు విఫలం అయినా కూడా రవీంద్ర జడేజా (11 నాటౌట్)తో కలిసి అక్షర్ పటేల్ మ్యాచ్ ను ముగించాడు.
అంతకముందు ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జోరూట్ (69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొక్క వికెట్ సాధించారు. వన్డే సిరీస్ లో భాగంగా చివరి వన్డే ఫిబ్రవరి 12న జరగనుంది.