ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) కోసం భారత్ తమ దేశానికి రాకపోవడంపై గుర్రుగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) మరోసారి తన అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. కరాచీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న ఎనిమిది దేశాల్లో ఏడు దేశాల జెండాలను ఉంచిన పీసీబీ.. భారత జెండా(Indian Flag)ను మాత్రం ఉంచలేదు. దీనిపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. భారత్ను మరోసారి పాకిస్థాన్ అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై పీసీబీ స్పందిస్తూ పాకిస్థాన్లో మ్యాచ్లు ఆడుతున్న దేశాల జెండాలను మాత్రమే స్టేడియాల్లో ఎగురవేస్తున్నామని.. భారత్ జట్టు తమ దేశంలో ఆడటం లేదు కాబట్టి జెండా ఎగురవేయలేదని స్పష్టం చేసింది. తాజాగా పాక్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. భారత పతాకాన్ని కరాచీ స్టేడియంపై ఏర్పాటు చేసింది. దీంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడింది. ఆతిథ్య దేశంలో భారత జెండాకు స్థానం దక్కిందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కాగా నేటి నుంచి ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 దేశాలు తలపడనున్నాయి. నాలుగేసి జట్లు రెండు గ్రూపులుగా పోటీ పడనున్నాయి. లీగ్ స్టేజ్లో ప్రతి జట్టు మూడేసి మ్యాచ్లు ఆడుతాయి. రెండు గ్రూపుల్లో టాప్ 2 జట్లు సెమీస్కు చేరుకుంటాయి. సెమీస్లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్- న్యూజిలాండ్ జట్ల మధ్య మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.