పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy-2025) గెలిచేందుకు అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. అయితే భద్రతాకారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్ వెళ్లడం లేదు. ఈనేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్లు అన్ని దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒకవేళ భారత్ ఫైనల్కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ కూడా దుబాయ్లోనే జరగనుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా జరగనుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
తాజాగా లాహోర్ గడాఫీ స్టేడియంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) తమ జట్టు కొత్త జెర్సీ లాంచ్ ఈవెంట్ను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్తో పాటు ఇతర క్రికెటర్లందరూ కొత్త జెర్సీ ధరించి స్టేడియంలో సందడి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జెర్సీ పూర్తి ఆకుపచ్చ రంగులో ఉంది. ఇక ఈ ఈవెంట్కు భారీగా తరలివచ్చిన ఆ జట్టు అభిమానులు కొత్త జెర్సీలో తమ అభిమాన ప్లేయర్లను చూసి కేరింతలతో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పీసీబీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది.