Temba Bavuma Hot Comments: ప్రపంచ టెస్టు ఛాంపియన్స్ ఫైనల్(WTC Final) మ్యాచ్ లో గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు తన 27 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుపై అద్భుతంగా పోరాడి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు సఫారీ జట్టుకు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టుకు కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో ఓడిపోతుందనే అపవాద ఉంది. ఎంతమంది స్టార్ ఆటగాళ్లున్నా సరే నాకౌట్ మ్యాచులలో ఒత్తిడిని జయించలేక ఓడిపోతుంది. దీంతో ఆ జట్టును ‘చోకర్స్’ అని పిలుస్తూ ఉంటారు. అంటే నాకౌట్ మ్యాచులలో విజయం సాధించలేని వారిని అలా పిలుస్తారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ లో గెలిచి ఆ ‘చోకర్స్’ ముద్రను చెరిపేసుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు మాత్రం మ్యాచ్ లో తమపై స్లెడ్జింగ్ చేసిందంటూ ప్రొటీస్ కెప్టెన్ తెంబా బవుమా సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాలుగో రోజు ఆట జరుగుతున్న సమయంలో తమ ఏకాగ్రత దెబ్బ తీసేందుు ఆసీసీ ప్లేయర్లు చోక్ అనే పదాన్ని పదే పదే ఉపయోగించారని తెలిపాడు. అయినా తమపై తమకు ఆత్మవిశ్వాసం ఉందని.. ఫైనల్ దాకా వచ్చినందుకు తమ జట్టుపై ఎన్నో సందేహలు ఉన్నాయన్నాడు. కానీ ఈ విజయం ఆ మాటలకు సమాధానంగా నిలిచిందంటూ పేర్కొన్నాడు.
ఇక ఆ జట్టు స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా జట్టును చాలా సంవత్సరాలుగా ‘చోకర్స్’ అనే ట్యాగ్ వెంటాడుతుందని.. ఈ విజయంతో ఆ ట్యాగ్ ఇక వినపడదని సంతోషం వ్యక్తం చేశాడు. గతంలో తమపై వచ్చిన ఎన్నో సందేహాలకు ఈ మ్యాచ్ సమాధానం ఇచ్చిందని కేశవ్ వెల్లడించాడు.
ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో కేవలం 138 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆసీస్ కు 74 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో కంగారు జట్టు 207 పరుగులకు ఆలౌటై సఫారీ జట్టుకు 282 పరుగుల టార్గెట్ విధించింది. నాలుగో ఇన్నింగ్స్ లో భారీ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా టీమ్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. కెప్టెన్ బవుమా పోరాటపటిమ, మార్క్రమ్ అద్బుతమైన సెంచరీతో విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీకి సగర్వంగా అందుకుని విశ్వవిజేతగా నిలిచింది.