ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. దాయాదుల పోరులో టీమిండియా బౌలింగ్ లో అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. పాకిస్తాన్ ను 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్కు ఓపెనర్లు బాబర్ ఆజామ్, ఇమామ్ ఉల్ హక్లు తొలి వికెట్ కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బాబర్ ఆజామ్ మంచి టచ్లో కనిపించాడు. 5 ఫోర్లు బాది క్రీజులో పాతుకుపోయినట్లు కనిపించాడు. బాబర్ను ఔట్ చేసి హార్దిక్ భారత్కు తొలి వికెట్ను అందించారు.
ఇక ఇమామ్ ఉల్ హక్ ఆరంభం నుంచి తడబడ్డాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సింగిల్ కోసం ప్రయత్నించి అక్షర్ పటేల్ వేసిన సూపర్ త్రోతో పెవిలియన్కు చేరుకున్నాడు. దీంతో 47 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే సౌద్ షకీల్, రిజ్వాన్లు భుజాన వేసుకున్నారు. రిజ్వాన్-సౌద్ షకీల్ జోడి మూడో వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని రిజ్వాన్ను ఔట్ చేయడం ద్వారా అక్షర్ పటేల్ విడగొట్టాడు.
అనంతరం భారత బౌలర్లు విజృంభించారు. రిజ్వాన్ ఔటైన కాసేపటికే సౌద్ షకీల్తో పాటు తయ్యబ్ తాహిర్ పెవిలియన్కు చేరుకున్నారు. ఆఖరిలో ఖుష్దిల్ షా, నదీమ్ షా లు రాణించడంతో పాక్ ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ (62) హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46) రాణించాడు. ఖుష్దిల్ షా (38), బాబర్ ఆజామ్ (23)లు ఫర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో రాణించాడు. హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు తలా ఒక వికెట్ లభించాయి.