పద్నాలుగు ఏళ్ల కుర్రాడు కానీ స్టేడియంలో వేసే షాట్లు మాత్రం సీనియర్ ప్లేయర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ స్టేజ్పై ఈ సీజన్లో సంచలనం సృష్టిస్తున్నాడు. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్.. ఈ 14 ఏళ్ల యువకుడిని కోటి రూపాయలకు దక్కించుకుంది. అంత చిన్న వయసులో అంత పెద్ద ధర అంటేనే అతనిపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. ఆ నమ్మకాన్ని అతను వృథా చేయలేదు. అరంగేట్ర మ్యాచ్లోనే ఎదురైన మొదటి బంతిని సిక్సర్గా మలిచాడు. అదే కాదు ఆ మ్యాచ్లో 34 పరుగులు చేసి తన ఆటలో టాలెంట్ ఎంత ఉందో చూపించాడు.
అతని అసలైన మేజిక్ మాత్రం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో బయటపడింది. 38 బంతుల్లో 101 పరుగులు చేస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు. 2010లో 37 బంతుల్లో సెంచరీ చేసిన యూసుఫ్ పఠాన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. అతని ఫామ్ అక్కడే ఆగలేదు.
చెన్నైపై హాఫ్ సెంచరీతో మరోసారి తన పవర్ హిట్టింగ్ టాలెంట్ చూపించాడు. కానీ ఆ మధ్య రెండు మ్యాచుల్లో డకౌట్ కావడంతో కొద్దిగా వెనకబడినప్పటికీ, మొత్తం ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడి 252 పరుగులు చేశాడు. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ 206గా ఉండటంతో బౌలర్లకు అతను నిద్రలేని రాత్రులు కలిగించాడు. ఇంతకు మించి అనేలా వైభవ్ మరో రికార్డు నెలకొల్పాడు. 20 ఏళ్ల లోపు వయసున్న క్రికెటర్.. అత్యధిక సిక్సర్లు (24) కొట్టిన బ్యాట్స్మన్గా నిలిచాడు. ఒకే ఇన్నింగ్స్లో 9 సిక్సర్లు బాదుతూ, ఇషాన్ కిషన్ రికార్డును కూడా అధిగమించాడు. ఇక బౌండరీల ద్వారా మాత్రమే 40 పరుగులు చేయడం ద్వారా టీ20ల్లో అరుదైన ఫీట్ను సాధించాడు.