Kavitha Comments On BC Reservations: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం హైదరాబాద్లోని విద్యానగర్లో రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యతో భేటీ కావడం పట్ల రాజకీయంగా చర్చనీయాంసం అయ్యింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం, కేంద్రం ఆమోదించాలని చెబుతుంతోందని’ అన్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. అందుకోసమే ఆర్ కృష్ణయ్య మద్దతు కోరడానికి వచ్చానని చెప్పారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్కరోజు కూడా బీసీల బిల్లు గురించి ప్రధాని మోడీతో మాట్లాడారా అని నిలదీశారు. బీసీ బిల్లు ఆమోదం పొందితే రాజకీయ, ఉద్యోగాలు, నిధులు వస్తాయని పేర్కొన్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వచ్చే నెల 17వ తేదీన రైల్రోకో చేపడతామని కవిత చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల అంశం తేలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఆపుతామని హెచ్చరించారు. అందరూ పోరాడితేనే బీసీ బిడ్డల కాళ్ల వద్దకు పదవులు వస్తాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/bandi-sanjay-hot-comments-on-kcr-and-cm-revanth-reddy/
ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల క్షేమం కోసం కవిత ముందుకొచ్చి పోరాడుతున్నారని ప్రశంసించారు. కవితకు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు మద్దతు ఇవ్వాలని కృష్ణయ్య కోరారు. బీసీలకు ఏళ్ల తరబడి అణచివేతకు గురవుతున్నారని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. వచ్చేనెల 17న జరిగే జాగృతి రైల్ రోకోకు తమ మద్దతు ఉంటుందని కృష్ణయ్య హామీ ఇచ్చారు. ఐక్యంగా పోరాడితేనే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు దిగివస్తాయని, కవిత బీసీ కాకపోయినా బీసీల సంక్షేమం పోరాటం చేస్తోందన్నారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కలిసికట్టుగా పోరాడుదామని కృష్ణయ్య పిలుపునిచ్చారు.
ALSO READ:https://teluguprabha.net/telangana-news/mahesh-kumar-goud-sensational-comments-on-phone-tapping/
కాగా, ఇటీవల కవిత చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్కువగా విమర్శలు చేయలేదని, ఇవి పార్టీ శ్రేణులను అసంతృప్తికి గురిచేశాయని కేసీఆర్కు రాసిన లేఖలో ప్రస్తావించిన విషయం, లేఖ లీక్ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. తనను ఇబ్బంది పెట్టిన బీజేపీపై సైలెంట్గా ఉండడం ఏంటని ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే.