Saturday, November 15, 2025
HomeTop StoriesDussehra Traffic: విజయవాడ-హైదరాబాద్ హైవేపై రెండో రోజూ భారీగా ట్రాఫిక్ రద్దీ

Dussehra Traffic: విజయవాడ-హైదరాబాద్ హైవేపై రెండో రోజూ భారీగా ట్రాఫిక్ రద్దీ

Heavy Traffic: దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)పై వరుసగా రెండో రోజు భారీ వాహనాల రద్దీ నెలకొంది. ఈ రద్దీ శనివారం (మొదటి రోజు) ప్రారంభమై ఆదివారం సాయంత్రం, రాత్రి వరకు కొనసాగింది.

- Advertisement -

ముఖ్యంగా హైదరాబాద్ వైపు వచ్చే మార్గంలో వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. నల్గొండ జిల్లాలోని పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజాల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి. చిట్యాల, చౌటుప్పల్‌, దండు మల్కాపురం వంటి ప్రాంతాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతూ కిలోమీటర్ల మేర బారులు తీరాయి. కొన్ని ప్రాంతాల్లో వంతెన నిర్మాణ పనుల కారణంగా కూడా రద్దీ సమస్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

టోల్‌ప్లాజా గణాంకాలు రద్దీ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద సాధారణ రోజుల్లో సగటున 40 వేల వరకు వాహనాలు వెళ్తుండగా, శనివారం ఒక్క రోజే 51 వేలకు పైగా వాహనాలు, ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 49 వేల వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లాయి. అదేవిధంగా, కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా (కేతేపల్లి) వద్ద రోజువారీ సగటు 25 వేలు కాగా, శనివారం 34 వేలు, ఆదివారం సాయంత్రానికి 27 వేల వాహనాలు దాటి వెళ్లాయి.

రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, టోల్‌ప్లాజా అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్‌ మార్గంలో టోల్ బూత్‌ల సంఖ్యను పెంచారు. మొత్తం 16 బూత్‌లలో హైదరాబాద్‌ వైపు 12 టోల్‌ బూత్‌లను తెరిచి, కేవలం నాలుగు బూత్‌లను మాత్రమే విజయవాడ మార్గానికి కేటాయించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసులు ఫీల్డ్‌లో ఉండి వాహనాలను క్రమబద్ధీకరిస్తూ పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల చిట్యాల నుంచి ఔటర్‌ రింగు రోడ్డు వరకు రావడానికి సుమారు 2 గంటలకుపైగా సమయం పట్టినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad