Friday, September 20, 2024
Homeతెలంగాణగోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలి

గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.పాడి పరిశ్రమకు, వ్యవసాయానికి,గ్రామీణ జీవన విధానానికి వెన్నెముకగా ఉన్న పశువులను చట్ట వ్యతిరేకంగా హత్యలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, గోరక్ష దక్షిణ భారత ప్రముఖ్ యాదగిరి రావు, గోరక్ష తెలంగాణ రాష్ట్ర సహా ప్రముఖ్ జి.రమేష్, విహెచ్ పి ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు విలేకరులతో మాట్లాడారు. ముక్కోటి దేవతలకు నిలయమైన గోవు హిందువుల పరమ పవిత్ర దైవమన్నారు. గోవును వధిస్తే మహా పాపమని పేర్కొన్నారు. ప్రతి ఏడాది బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా గో హత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి పనికి వచ్చే పశువులను క్రూరంగా వధించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ, హత్యలను ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపించారు.బక్రీద్ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం గోవులను, పశువులను రవాణా చేసే సందర్భంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారని అవి నామమాత్రంగా కొనసాగుతున్నాయని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆవులను వధిస్తున్న కూడా ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం దుర్మార్గమన్నారు. బక్రీద్ సందర్భంగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బజరంగ్ దళ్ బరిలోకి దిగుతుందని హెచ్చరించారు.బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సొంతంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని గో అక్రమ రవాణాను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఈనెల 14 వ తేదీన ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ఒక్క గోవును కూడా అక్రమంగా వధించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇందిరాపార్క్ దగ్గర బుధవారం నిర్వహించే ధర్నా కార్యక్రమానికి ప్రతి హిందువు కదలి రావాలని వారు పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం మంత్రికి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించే ధర్నా పోస్టర్ విడుదల చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News